నారాయణ మూర్తి ‘రైతన్న’ మూవీని ఫ్యామిలితో కలిసి చూసిన TRS ఎమ్మెల్యే

by  |
నారాయణ మూర్తి ‘రైతన్న’ మూవీని ఫ్యామిలితో కలిసి చూసిన TRS ఎమ్మెల్యే
X

దిశ, నర్సంపేట : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను కండ్లకు కట్టినట్టు చూపించిన రైతన్న చిత్రాన్ని చూసేందుకు నర్సంపేట నియోజక వర్గం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణ మూర్తి స్వయంగా నిర్మించిన చిత్రాన్ని వీక్షించడానికి స్థానిక జయశ్రీ థియేటర్‌కి మార్నింగ్ షో సమయానికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సమేతంగా చేరుకున్నారు.

నియోజక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి వారు రైతన్న చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతన్న సినిమా అద్భుతంగా తీశారని కొనియాడారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాల ద్వారా రైతుల అస్థిత్వం దెబ్బ తినే అవకాశం ఉందన్నారు. కరెంట్ కోత, మద్దతు ధర లేకపోవడం, భూములను కుదవబెట్టడం, ఆత్మహత్య మొదలైనవి.. రైతు నిత్యజీవితంలో ఎదుర్కొనే పరిస్థితులను కండ్లకు కట్టినట్టు నారాయణ మూర్తి చూపించారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు రైతులకు చాలా ప్రమాదకరమని ఈ సినిమాలో చూపించారని, అది వాస్తవమన్నారు. దళిత, బడుగు బలహీన వర్గాల రైతుల కష్ట సుఖాలకు అద్దం పడుతూ ఈ రైతన్న సినిమాను తెరకెక్కించారన్నారు. రైతులు ఆర్థికపరంగా ఎంత వేదనకు గురవుతారో వాస్తవికతకు దగ్గరగా చూపెట్టారని గుర్తుచేశారు. రైతు ఉద్యమాలలో పాల్గొనడం ముందు నుండే ఇష్టమైన తనను ఈ చిత్రం ఎంతోగానో ఆకర్షించిందన్నారు.

ఎమ్మెల్యేకి పీపుల్స్ స్టార్ కృతజ్ఞతలు..

జయశ్రీ థియేటర్‌లో మార్నింగ్ షోకి విచ్చేసిన ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి నటుడు నారాయణ మూర్తి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రైతు వ్యతిరేక చట్టాల వల్ల వ్యవసాయం మొత్తం కార్పొరేట్‌గా మారిపోయిందన్నారు. రైతు కుటుంబం నుండి వచ్చిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి రైతుల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉందన్నారు. రైతన్న సినిమాను రైతులతో కలిసి వీక్షించిన సుదర్శన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సినిమాను ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కమిషనర్, మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, రైతన్నలు, కలిసి వీక్షించారు.


Next Story

Most Viewed