- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుజురాబాద్లో విచిత్రం.. TRS ఎమ్మెల్యే తీరుపై నేతలు, కార్యకర్తలు షాక్
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఆయన వేదికెక్కాడంటే చాలు తన వాగ్ధాటిని ప్రదర్శిస్తూనే.. మధ్య మధ్యలో గాత్రానికి పని చెప్తారు. తెలంగాణ స్వరాష్ట్ర కల సాకారం కోసం రాసిన పాటలే అయినా.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ పథకాలతో ప్రజలు సుభిక్షంగా ఉంటున్న తీరుపైనే అయినా అప్పటికప్పడు తన గళంతో సభికులను మంత్ర ముగ్దులను చేస్తారు. అసెంబ్లీలో అయినా గ్రామంలో అయినా తన భావాలను పాట రూపంలో వివరించేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇప్పుడాయన స్వరం మూగబోయింది. […]</p>

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఆయన వేదికెక్కాడంటే చాలు తన వాగ్ధాటిని ప్రదర్శిస్తూనే.. మధ్య మధ్యలో గాత్రానికి పని చెప్తారు. తెలంగాణ స్వరాష్ట్ర కల సాకారం కోసం రాసిన పాటలే అయినా.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ పథకాలతో ప్రజలు సుభిక్షంగా ఉంటున్న తీరుపైనే అయినా అప్పటికప్పడు తన గళంతో సభికులను మంత్ర ముగ్దులను చేస్తారు. అసెంబ్లీలో అయినా గ్రామంలో అయినా తన భావాలను పాట రూపంలో వివరించేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇప్పుడాయన స్వరం మూగబోయింది. సమావేశాలకు హాజరవుతున్నా స్పీచ్లతోనే సరిపెడుతున్నారు. కానీ పాటలతో అలరించడం లేదు.
మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అటు టీఆర్ఎస్ నాయకులను.. ఇటు సమావేశాలకు హాజరవుతున్న వారిని కూడా రసమయి ఒకింత షాక్కు గురి చేస్తున్నారనే చెప్పాలి. ఈటల రాజేందర్ ఎపిసోడ్ తరువాత హుజురాబాద్.. రాష్ట్ర రాజకీయాలకు రాజధానిగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రసమయి బాలకిషన్ హుజురాబాద్ పట్టణంలో జరుగుతున్న సమావేశాలకు హాజరై ప్రసంగించి వెళ్లిపోతున్నారు తప్ప.. పాటలతో అలరించే ప్రయత్నం చేయడం లేదు.
రసమయి మైకు పట్టుకున్నాడంటే చాలు సభకు హాజరైన వారిలో జోష్ వచ్చేస్తుంది. అప్పటి వరకు ప్రముఖుల ఉపన్యాసాలతో స్తబ్దంగా ఉన్న సభా ప్రాంగణమంతా కూడా అలర్ట్ అవుతుంది. యతి ప్రాసలతో కూడిన ఉపన్యాసం ఇస్తూ మధ్య మధ్యలో తెలంగాణ పాటలతో తన మార్క్ స్పీచ్కే అత్యంత ప్రాధాన్యం ఇస్తుంటారు. కళాకారుడిగా రసమయి బాలకిషన్.. తెలంగాణ యాస, భాషలతో గళమెత్తి అందరిని ఆకర్షించే వారు. ఉద్యమ ప్రస్థానంలో కూడా ఆయన ఆడి పాడిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కూడా తనలోని కళను మాత్రం తరుచూ ప్రదర్శిస్తూనే ఉన్నారు, అయితే హుజురాబాద్లో జరుగుతున్న సభలకు హాజరవుతున్న రసమయి నోటి నుంచి.. మాటలు తప్ప పాటలు జాలువారడం లేదన్న నిరాశే ఆయన అభిమానుల్లో ఎక్కువైంది. రసమయి గాత్రంతో తన్మయత్వం చెందే టీఆర్ఎస్ నాయకులను, సామాన్యులను నిరాశ పరుస్తున్నారు.
అలా వచ్చి ఇలా వెళ్తూ..
హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన సభలకు హాజరవుతున్న రసమయి తన వంతు రాగానే ప్రసంగించి మౌనంగా ఉంటున్నారు. ఓ సభలో కెప్టెన్ లక్ష్మీ కాంతరావు కూడా మా రసమయి పాట పాడుతాడని ప్రకటించినా.. నమస్కారంతోనే సరిపెట్టారు తప్ప గానం మాత్రం చేయలేదు. హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు ఇంఛార్జీలను నియమించిన టీఆర్ఎస్ అధిష్టానం రసమయికి ప్రాధాన్యత కల్పించకపోవడంతోనే కినుకు వహించారా.? అన్న చర్చ కూడా సాగుతోంది. మంత్రి గంగుల కమలాకర్ ప్రసంగంలో మాత్రం రసమయి తమతో పాటు హుజురాబాద్లోనే కలిసి పనిచేస్తారని ప్రకటించారు.
ఇంఛార్జీ ఇవ్వకపోవడం వెనక..?
హుజురాబాద్ నియోజకవర్గానికి పక్కనే.. మానకొండూరు నియోజకవర్గం ఉంటుంది. రెండు నియోజకవర్గాల ప్రజలకు అవినాభావ సంబంధాలు కూడా ఎక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో రసమయికి హుజురాబాద్లో ఎలాంటి బాధ్యతలను అధిష్టానం అప్పగించనట్టు స్పష్టం అవుతోంది. హుజురాబాద్తో అంతగా సంబంధాలు లేని వారికి బాధ్యతలు అప్పగించినప్పటికీ.. రసమయి విషయంలో అధిష్టానం అంతగా దృష్టి పెట్టకపోవడమే విచిత్రం. పాట పాడుతూ.. ప్రసంగిస్తూ ఒంటి చేత్తో సభా ప్రాంగణాన్ని ఊర్రూతలూగించే వారు. రసమయి పాటలతో వ్యతిరేక ఓట్లను కూడా పార్టీకి అనుకూలంగా మల్చుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఆయన మాత్రం స్పీచ్లతోనే సరిపెడుతుండటం పార్టీకి కూడా కొంతమేర నష్టమే అంటున్నవారూ లేకపోలేదు.






