టీఆర్‌ఎస్ నేత బూతు పురాణం… చంపుతానంటూ బెదిరింపు

by  |
trs leader
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: టీఆర్ఎస్ నేతల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా.. ఫోన్లలో తిట్ల దండకం అందుకుంటున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అతిగా ప్రవర్తిస్తున్నారు. ఏకంగా చంపుతామని బెదిరింపులకు గురి చేయడమే కాకుండా.. ఫోన్లు చేసి వేధింపులకు గురి చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. టీఆర్ఎస్ ఖమ్మం టౌన్ సెక్రటరీగా ఉన్న ఇసాక్ తనను ఫోన్‌లో బూతులు తిడుతున్నాడని, బెదిరింపులకు గురిచేస్తూ వేధిస్తున్నాడని సౌదీ అరేబియా దమ్మం ప్రాంతం నుంచి సయ్యద్ మునీర్ ఆలం ‘దిశ ప్రతినిధి’కి ఫోన్ చేసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. అంతేకాదు ఖమ్మం వస్తే తనను చంపుతానని బెదిరిస్తున్నాడంటూ వాపోయాడు. సోషల్ మీడియాలో బూతులు తిట్టిన ఆడియోలను పోస్ట్ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. అయితే ఇలాంటి చర్యల వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటున్నా.. పెద్దలు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఆ పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తుండడం గమనార్హం.

దేశ, విదేశాల్లో పార్టీ కోసం కష్టపడితే..

ఖమ్మం మున్సిపాలిటీలోని 42వ డివిజన్ కు చెందిన మునీర్ ఉద్యోగ రీత్యా కొన్నేళ్లుగా సౌదీ అరేబియాలో ఉంటున్నారు. 2001 నుంచి ఉద్యమంలో పాల్గొన్నారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తూ దేశ, విదేశాల్లో పార్టీ ప్రతిష్టను వ్యాప్తి చేశారు. గతంలో భారతదేశం వచ్చినప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్న చరిత్ర కూడా ఉంది. సౌదీ అరేబియా దమ్మం ప్రాంతంలో ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసి ఎన్నో అవమానాలు భరించారు. అయితే కొన్ని సందర్భాల్లో కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణపై సోషల్ మీడియా పరంగా జరుగుతున్న చర్చల్లో తమ హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ఈయన చేసిన తప్పుగా మారింది. నిన్న కాక మొన్న టీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకున్న వారు తాను సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, జీర్ణించుకోలేక ఇలా ఫోన్లలో ఇష్టం వచ్చినట్లు తిడుతూ, సోషల్ మీడియాలో ఆడియోలు పోస్ట్ చేయడమే కాకుండా తనను చంపుతానని బెదిరిస్తున్నారని మునీర్ వాపోతున్నారు.

ఇదేం బూతు పురాణం..

టీఆర్ఎస్ ఖమ్మం టౌన్ సెక్రెటరీగా ఉన్న ఇసాక్ తిట్ల దండకానికి సంబంధించిన ఆడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. చెప్పడానికి వీళ్లేని భాషలో ఓ వ్యక్తిపై అధికార పార్టీకి చెందిన నాయకుడు ఇలా మాట్లాడడం పార్టీ శ్రేణులతో పాటు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఇంత జరుగుతున్నా ఈ ఘటనపై పార్టీ పెద్దలు ఎవరూ నోరు మెదపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఏదైనా చర్చ జరిగినప్పుడు సావధానంగా సమాధానం చెప్పొచ్చని, విమర్శలను తట్టుకోలేకపోతే దానికి ప్రజాస్వామ్యయుతంగా బదులు ఇవ్వవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాని ఇంత దిగజారుడుతనం దేనికంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పెద్దలు బహిరంగంగా స్పందించకపోయినా పార్టీ శ్రేణులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మంత్రి గారూ స్పందించరూ..

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ కోసం అహర్నిశలూ కృషి చేస్తున్నారు. జిల్లాను ఇప్పటికే అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. అలాంటిది టౌన్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి వల్ల పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని పార్టీకి చెందిన కొందరు చెబుతున్నారు. విదేశాల్లో ఉన్న వ్యక్తిపై, పార్టీ కోసం దేశవిదేశాల్లో కృషిచేసిన వ్యక్తిపై బూతులు మాట్లాడుతూ చంపుతానని బెదిరించడం, ఆడియోలు గ్రూపుల్లో పోస్టు చేయడం వంటి చర్యలపై మంత్రి దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

Next Story

Most Viewed