సిద్దిపేట అభివృద్ధిపై టీఆర్ఎస్ లీడర్ సంచలన ఆరోపణలు

by  |
Jeevan Raju
X

దిశ, వెబ్‌డెస్క్ : టీఆర్ఎస్ నాయకుడిని అయ్యుండి కూడా తన తండ్రిని కరోనా నుండి కాపాడుకోలేక పోయానని, ఆక్సిజన్ కూడా సంపాదించలేకపోయానని సిద్దిపేటకు చెందిన గడ్డమీది రాజాగౌడ్ (జీవన్ రాజు) ఆరోపించారు. సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి అంటే శవాలను దాచిపెట్టడమేని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్తే చనిపోవడమేనని, ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. 16 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకి సేవ చేస్తున్నా.. ప్రభుత్వ ఆస్పత్రిలో తన తండ్రికి ఆక్సిజన్ పెట్టించలేకపోయని వాపోయాడు. టీఆర్ఎస్ పాలనను ఎండగడుతూ బుధవారం ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

టీఆర్ఎస్ పెద్ద నాయకులకు అపోలో, యశోద ఆస్పత్రుల డాక్టర్లు ఇంటికి వచ్చి వైద్యం చేసి పోతున్నారని, వాళ్లు ప్రభుత్వ దవాఖానలకు వస్తే పరిస్థితి ఎలా ఎందో తెలుస్తుందని వివరించాడు. తెలంగాణలో రోజుకు కేవలం 30 మంది చనిపోతున్నారని ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతుందని, కానీ సిద్దిపేట ఒక్క ప్రభుత్వ ఆస్పత్రిలోనే 30 నుంచి 40 మంది చనిపోతున్నారని తెలిపారు. నా లెక్క తప్పు అయితే సిద్దిపేట ఆస్పత్రికి వస్తే నిరూపిస్తానని జీవన్ రాజు సవాల్ చేశారు. తాను ఎవరినో విమర్శించడానికి వీడియో రిలీజ్ చేయడం లేదని, అధికార పార్టీలో ఉండి కూడా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

తన తండ్రికి ఆక్సిజన్ అవసరం ఉన్నా.. మీ నాన్నకు 60 ఏండ్లు.. అక్కడ 45 ఏండ్ల లోపు వాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లకే ఆక్సిజన్ పెడతాం అని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ప్రభుత్వం టెస్టులు చేయకుండా కరోనా తగ్గిందని, మరణాలను తగ్గించి చెప్పి ప్రజలను మభ్యపెట్టవద్దని ఆయన కోరారు.


Next Story

Most Viewed