ఇంద్రవెల్లి సభలో కాంగ్రెస్ కోవర్టులు దొరికేనా..?

by  |
ఇంద్రవెల్లి సభలో కాంగ్రెస్ కోవర్టులు దొరికేనా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ఇంద్రవెల్లి దళిత దండోరా రెండు పార్టీల్లోనూ కీలకంగా మారింది. ఈ దండోరా విజయవంతం అవుతుందా, విఫలమవుతుందా అనే అంశం పక్కనపెడితే ఇరు పార్టీల నేతలు క్లారిటీకి రానున్నారు. కాంగ్రెస్ కోవర్టులెవ్వరో, పార్టీకి విధేయులెందరనే విషయం అంచనాకు రానుంది. దీంతో దళిత దండోరా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఈ పోరుబాటపై కాంగ్రెస్‎లోని కొంతమంది నేతలు వ్యతిరేకించారు. ఏఐసీసీ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్​కమిటీ చైర్మన్​ ఏలేటి మహేశ్వర్​రెడ్డి బహిరంగంగానే విమర్శలు చేశారు. కానీ, రేవంత్​వర్గం ఆయన్ను బుజ్జగించింది. దీంతో ఆయన అలకవీడాడు. మరోవైపు టీపీసీసీ చీఫ్​అంశంలో రేవంత్​రెడ్డిని వ్యతిరేకించిన జగ్గారెడ్డి ఇప్పుడు సభా బాధ్యతలను భుజానేసుకున్నారు. ఇలా పార్టీ నేతలంతా దళిత దండోరాను విజయవంతం చేసే పనిలో పడ్డారు. కానీ కొంతమంది నేతలు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. కనీసం మాట కూడా మాట్లాడటం లేదు.

కోవర్టులను తేల్చేస్తారా

కాంగ్రెస్​పార్టీలో కేసీఆర్ కోవర్టులున్నారనేది ఏడేండ్ల నుంచి ఆరోపణలున్నాయి. ఇటీవల ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి సమీప బంధువు కౌశిక్​రెడ్డి టీఆర్ఎస్‎లో చేరడం, ఎమ్మెల్సీ పదవి ఖరారు కావడంపై టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి పలు ఆరోపణలు చేశారు. కోవర్డు అయినందునే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇంద్రవెల్లి నుంచి పోరుబాట పడుతున్నామని, దాదాపు 18 నియోజకవర్గాల్లో దండోరా మోగిస్తున్నామని రేవంత్​రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం ఓ వైపు దళిత బంధును ప్రవేశపెట్టి, దళిత వర్గాల మద్దతు కూడగడుతుంటే కాంగ్రెస్​దానికి బ్రేక్​వేసే విధంగా దళిత దండోరాను చేపట్టింది. అయితే దళిత బంధుకు వ్యతిరేకం కాదంటూ చెప్పుతున్న టీపీసీసీ చీఫ్​… రాష్ట్రమంతా వర్తింపచేయాలంటూ పేర్కొన్నారు. కేవలం శాంపిల్స్ మాదిరిగా కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుకుని, మిగిలిన దళితులందరినీ ఆశల్లో పెడితే వదిలిపెట్టమంటూ టీఆర్ఎస్‎కు వార్నింగ్ ఇచ్చారు.

కాగా దళిత దండోరాకు రాష్ట్రంలోని కాంగ్రెస్​ శ్రేణులు కదలివస్తారని, పార్టీ నేతలంతా అక్కడే ఉంటారని టీపీసీసీ గత వారం రోజుల నుంచి చెప్పుతోంది. పలు కమిటీలు కూడా నియమించారు. కానీ ఇప్పటి వరకు పలువురు ఎంపీలు, నేతలు, ఎమ్మెల్యేలు కూడా దానిపై మాట్లాడటం లేదు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఉత్తమ్​కుమార్​రెడ్డితో పాటు రాజగోపాల్​రెడ్డి, శ్రీధర్​బాబు, వీరయ్యతో సహా పలువురు నేతలు నోరెత్తడం లేదు. దీన్ని వ్యతిరేకిస్తున్నారా.. మద్దతు ఇస్తున్నారా అనే అంశంపై క్లారిటీ ఇవ్వడం లేదు. కాంగ్రెస్​ పార్టీ సీనియర్లు ఇంద్రవెల్లికి వెళ్తారా లేదా అనేదే పార్టీలో ఇప్పుడు ప్రధాన చర్చ. అయితే దళిత దండోరాకు వెళ్లకుండా ఉండే వారిని అసంతృప్తులుగా.. కేసీఆర్​ కోవర్టులుగా చూపించేందుకు టీపీసీసీ సన్నాహాలు చేస్తోంది. దీనికి భారీ స్కెచ్​కూడా రూపొందించారని పార్టీ నేతలు చెప్పుతున్నారు.

గైర్హాజరు నేతలపై టీఆర్​ఎస్​ ఫోకస్​

మరోవైపు ప్రతిపక్ష పార్టీల నేతలపై ఫోకస్​పెట్టిన టీఆర్ఎస్.. ఇంద్రవెల్లి సభకు వెళ్లకుండా ఉండే నేతలకు గాలం వేయాలని రెడీగా ఉంది. ఆ పార్టీలోని అసంతృప్తిని అనుకూలంగా మల్చుకుని, గులాబీ దళంలోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్​నేతలకు టీఆర్ఎస్ ఆఫర్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు రేవంత్​రెడ్డి వర్గాన్ని విభేదిస్తూ ఇంద్రవెల్లి సభకు వెళ్లకుండా ఉంటే వారు అధికార పార్టీకి చిక్కినట్టే. దీంతో ఈ రెండు ప్రధాన పార్టీలకు ఇంద్రవెల్లి సభ కీలకంగా మారింది.

Next Story

Most Viewed