టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ మరోసారి వాయిదా?

by  |
trs 1
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ లోగా పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని భావించినప్పటికీ.. జిల్లా, రాష్ట్ర కమిటీలను నేటివరకు ప్రకటించలేదు. ఈ తరుణంలో అక్టోబర్ 1న హుజూరాబాద్ ఉపఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో.. కమిటీలను ప్రకటిస్తే కమిటీల్లో చోటు దక్కని ఆశావాహులు తిరుగుబాట ఎగురవేసే అవకాశం ఉంది. ఈ ఎఫెక్ట్ ఉపఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పెండింగ్ లో ఉన్న కమిటీలను పూర్తి చేయనున్నారు. ప్లీనరీని అనుకున్న సమయానికి నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు.

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి ఈ ఏడాది ఏప్రిల్ 27 నాటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పార్టీ ద్విదశాబ్ది వేడుకలను 6 లక్షల మందితో ఘనంగా నిర్వహించాలని భావించినప్పటికీ.. కరోనాతో వాయిదా వేశారు. దీంతో 2019, 2020, 2021లో వరుసగా మూడు సార్లు వాయిదా పడింది. అయితే తిరిగి పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలని భావించి ఈ నెల 2 నుంచి పార్టీ గ్రామ, వార్డు, మండల కమిటీలతో పాటు జిల్లా, రాష్ట్ర కమిటీలను చివరి నాటికి పూర్తి చేయాలని భావించారు. అయితే పార్టీల్లో అంతర్గత విభేదాలతో పూర్తిస్థాయిలో మండల కమిటీలను నియమించలేదు. జిల్లా, రాష్ట్ర కమిటీలను సైతం ప్రకటించలేదు. ఈ సమయంలోనే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడం, సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడంతో కమిటీలు వాయిదా పడ్డాయి. ఇదిలా ఉంటే అక్టోబర్ ఒకటిన హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో ఆ నెల మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎన్నికల ప్రచారంలోనే ఉండనున్నారు. వారు స్థానికంగా ఉండే అవకాశం లేకపోవడంతో కమిటీలను ప్రకటించే అవకాశం లేదు. నవంబర్ లోనే జిల్లా, రాష్ట్ర కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది.

ఎన్నికల ప్రచారంలో ప్రజాప్రతినిధులు ఉండగా కమిటీలను ప్రకటిస్తే.. అసమ్మతి నేతలకు సంబంధించిన కులాల ఓట్లపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక్కో జిల్లా నుంచి అధ్యక్ష పదవి కోసం ముగ్గురు, నలుగురు సామాజిక వర్గాల వారీగా పోటీ పడుతున్నారు. అయితే ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో రానివారు గళం వినిపించే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత సైతం వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీలోని నేతలు పేర్కొంటున్నారు. అయితే నవంబర్ చివరి నాటికి రాష్ట్ర, జిల్లాతో పాటు గ్రేటర్ లోని డివిజన్లు, కాలనీ, బస్తీ కమిటీలను పూర్తి చేయనున్నారు. ఆ కమిటీలకు శిక్షణ నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ స్వయంగా పేర్కొన్నారు. ఇదంతా పూర్తయ్యే వరకు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ప్లీనరీ డిసెంబర్‌లో నిర్వహిస్తారా? లేకుంటే వాయిదా వేస్తారనేది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కమిటీల జాప్యం, హుజూరాబాద్ ఉప ఎన్నికలు రావడంతో పదవుల భర్తీ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న నేతల్లో అసమ్మతి ఉన్నప్పటికీ బయటకు చెప్పలేక ఇతర పార్టీలోకి వెళ్లలేక లోలోన మదన పడుతున్నారు.



Next Story

Most Viewed