కార్పొరేట్ సంస్థల చందాలతోనే ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ.. 

by  |
కార్పొరేట్ సంస్థల చందాలతోనే ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ.. 
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ సర్కార్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇచ్చే చందాలతోనే ఎన్నికల్లో పోటీ చేస్తోందని, కానీ ఆయా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్స్‌ను మాత్రం పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఖైరతాబాద్‌లో జరిగిన ‘ఉద్యమ గళాల గర్జన’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్, వరంగల్ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఏ సర్వే ఫలితాలు చూసినా బీజేపీకే అనుకూలంగా ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పరిస్థితి ఎలా ఉండనుందో నిఘా వర్గాల ద్వారా కేసీఆర్‌ ఆరా తీశారని రిపోర్ట్‌ నెగెటివ్‌గా ఉండడంతో భయపడుతున్నారన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే పీఆర్సీపై స్పష్టమైన హామీ ఇవ్వాలని, ఆయన పీఆర్సీ ప్రకటన చేస్తే తమ పార్టీ తరపున అభ్యంతరం చెప్పబోమని స్పష్టం చేశారు. నిరుద్యోగులపై కేసీఆర్‌ది కపట ప్రేమని, ఆయన ఎన్నికల సందర్భంగా ప్రకటించిన నిరుద్యోగ భృతి ఎటుపోయిందని ప్రశ్నించారు.

టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా ధర్నా చేసే పరిస్థితి ఉండేది కాదని, బీజేపీ చేసిన పోరాటంతోనే ఇప్పుడు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను అడ్డుకునే శక్తి ఒక్క బీజేపీయే అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ముఖ్యమంత్రి హామీలు ఇస్తాడని, ఎలక్షన్స్‌ అయిపోయిన తర్వాత ఫామ్ హౌస్‌లోనే ఉంటారన్నారు. నేను రూ.600 కోట్లు సంపాదించానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఎవరైనా నిరూపించగల్గితే నిరుద్యోగ భృతికే ఆ డబ్బు మొత్తం ఇస్తానన్నారు. తెలంగాణ స్ఫూర్తి ప్రదాత జయశంకర్‌తో సహా కవులు, కళాకారులు, ఉద్యమకారులను కేసీఆర్‌ ప్రణాళిక ప్రకారం తొక్కేశాడరన్నారు. మంత్రి కేటీఆర్‌ విశాఖ ఉక్కు గురించి మాట్లాడే ముందు అజంజాహీ మిల్స్, నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తే బాగుంటుందన్నారు.

Next Story

Most Viewed