టీఆర్ఎస్, బీజేపీ తోడుదొంగలు.. రేవంత్ రెడ్డి ఫైర్

by  |
Revanth Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని, ఈ రెండు పార్టీలూ తోడుదొంగలేనని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతు రాజ్యం, జై కిసాన్ అని వల్లె వేస్తున్న ఈ రెండు పార్టీలు రైతుల్ని గాలికొదిలేశాయని, ఈ పార్టీలకు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమని గొప్పగా చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం వడ్లను కొనుగోలు చేయడానికి కూడా డబ్బులు వెచ్చించలేకపోతున్నదా అని నిలదీశారు. బడ్జెట్‌లో ఇందుకోసం కనీసం పది వేల కోట్ల రూపాయలను కూడా కేటాయించలేదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్ ఇంటికే పరిమితమయ్యారని, జంతర్‌మంతర్‌లో దీక్ష చేయాలని డిమాండ్ చేశారు.

దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాల వేసిన సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు రేవంత్ రెడ్డి పై విధంగా స్పందించారు. రైతు సంక్షేమం గురించి గొప్పగా చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ వరి ధాన్యం కొనుగోలుకు డబ్బులు ఎందుకు కేటాయించలేకపోతున్నారని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమే అయినప్పుడు రైతుల అవసరాల కోసం ఆ మాత్రం కూడా ఖర్చు చేయలేరా అని నిలదీశారు. ప్రత్యేక బడ్జెట్‌ను పెట్టి ప్రతీ ధాన్యం గింజను కొనాల్సిందేనని డిమాండ్ చేశారు.

వడ్ల కొనుగోళ్లపై ధర్నాలు చేయడానికి రెండు అధికార పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ విజ్ఞప్తులకు పోలీసులు, జిల్లా కలెక్టర్లు అనుమతి ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ఆందోళనలకు ఎందుకు రావని ప్రశ్నించారు. నిబంధనలు కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమేనా, ఆ రెండు రెండు పార్టీలకూ వర్తించవా అని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల అవతారం ఎత్తారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ తలపెట్టిన ప్రజా చైతన్య యాత్రను రద్దు చేయలేదని, పరిస్థితుల కారణంగా వాయిదా మాత్రమే వేశామని వివరించారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ధర్నాలకు, నిరసనలకు, ఆందోళనలకు అనుమతి మంజూరు చేయడంలో ప్రభుత్వ అధికారులు చూపిస్తున్న పక్షపాతం గురించి ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకెళ్తామన్నారు.



Next Story

Most Viewed