టీఆర్ఎస్ బలహీనపడింది: కోదండరామ్

by  |
టీఆర్ఎస్ బలహీనపడింది: కోదండరామ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపడిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రజల ఆదరణ రోజురోజుకూ తగ్గిపోయి..ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతూ ఉందని వ్యాఖ్యానించారు. ఆరున్నరేండ్ల కాలంలో టీఆర్‌ఎస్ పాల్పడిన అవినీతిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. విచారణ ఎప్పుడు జరుగుతుందోననే కేసీఆర్‌కు భయం పట్టుకుందని, అందుకనే ఆయన అన్ని రకాలుగా కేంద్రంపై ఆధారపడుతున్నారని, ఢిల్లీవైపు చూపునకు కారణం అదేనని అన్నారు. నిరుద్యోగులు, రైతులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లకు మద్దతుగా కోదండరాం రెండు రోజుల నిరాహారదీక్షను.. పార్టీ కార్యాలయంలో ఆదివారం ప్రారంభించిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.

తొలుత దీక్షను ధర్నా చౌక్ దగ్గర చేపట్టాలని భావించినా కరోనా కారణాన్ని చూపి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పార్టీ కార్యాలయంలోనే ప్రారంభించారు. దీక్ష చేస్తున్న కోదండరాంను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య తదితరులు పరామర్శించారు. ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం తక్షణం క్యాలెండర్‌ను విడుదల చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. రైతులను, ఉపాధ్యాయులను, లెక్చరర్లను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు



Next Story

Most Viewed