గులాబీల ‘దీక్షా దివస్’.. కమలనాథుల ‘కార్తీక పౌర్ణమి’

by  |
గులాబీల ‘దీక్షా దివస్’.. కమలనాథుల ‘కార్తీక పౌర్ణమి’
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగింది. ఆఖరి రోజు సమయాన్ని అన్నిపార్టీలు సద్వినియోగం చేసుకున్నాయి. సెంటిమెంట్‌తో ఒకరు, విశ్వాసంతో మరొకరు ప్రచారాన్ని కొనసాగించారు. తెలంగాణ దీక్షా దివస్, కార్తీక పౌర్ణమిని టీఆర్ఎస్, బీజేపీ వాడుకున్నాయి. ఉద్యమంలో చావు నోట్లో తల పెట్టొచ్చినట్లుగా సీఎం కేసీఆర్‌ను చిత్రీకరిస్తూ టీఆర్ఎస్ ప్రచారాన్ని నిర్వహించింది. సోషల్ మీడియాలో నాటి ఫోటోలు, సంఘటనలను గుర్తు చేస్తూ.. అప్పటి ఉద్యమ స్ఫూర్తిని బల్దియాలో కొనసాగించాలని టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. “దీక్షా దివస్-నవంబర్ 29″ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక అపూర్వ ఘట్టం, యావత్ ప్రజలని, సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష అంటూ టీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అనుకూల సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు దర్శనమిచ్చాయి.

బల్దియా ఎన్నికలకు ముడి పెడుతూ సీఎం కేసీఆర్‌కు మద్దతునివ్వాలని ఓటర్లను అభ్యర్ధించాయి. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు నేటికి 11 ఏండ్లు పూర్తయ్యాయి. ఉద్యమాన్ని మలుపుతిప్పిన ఒక అపూర్వ ఘట్టంగా కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అలాగే బీజేపీ కూడా ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్నది. కార్తీక పౌర్ణమిని బాగా వాడుకుంది. కేంద్రం హోంమంత్రి అమిత్ షా కార్తీక పౌర్ణమి సందర్భంగా చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాతే రోడ్డు షోను ప్రారంభించారు. బేగంపేట విమానాశ్రయంలో దిగిన తర్వాత నేరుగా అమ్మవారి ఆలయానికే వెళ్లడం గమనార్హం. కార్తిక పౌర్ణమి నాడు పూజలు చేయడం ద్వారా విజయాన్ని పొందాలని కోరుకున్నారు. ఇరుపక్షాలు ప్రజల సెంటిమెంట్‌తో ఓట్లను పొందే ప్రయత్నం చేశాయి.



Next Story