పత్తి రైతులను దోచుకుంటున్న దళారులు

by  |
పత్తి రైతులను దోచుకుంటున్న దళారులు
X

దిశ, వేములవాడ: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంటపై దళారుల కన్ను పడింది. రైతుల ఇంటి దగ్గరే పత్తిని కొనుగోలు చేస్తూ తూకంలో మోసం చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఒక పక్క మద్ధతు ధర కల్పిస్తామని, సీసీఐలో అమ్ముకోవాలని అధికారులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో దళారులకు వరంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పత్తి ఏరడానికి కూలీలకు ఇచ్చేందుకు డబ్బులు లేక రైతులు దళారులకు విక్రయిస్తున్నారు. అదేవిధంగా పత్తి సాగుకు కావాల్సిన పెట్టుబడి, విత్తనాలు, ఎరువులు తదితర వస్తువులను ఇచ్చిన ఫర్టిలైజర్ వ్యాపారులు తమకే పత్తిని అమ్మాలని షరతు పెట్టడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బహిరంగంగానే రైతులను దోచుకుంటున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో దళారులు రెచ్చిపోతున్నారు.

క్వింటాల్‌కు రూ. 3 వేలు

పత్తి క్వింటాల్‌కు రూ. 3 వేల నుంచి రూ. 3 వేల 6 వందల వరకు మాత్రమే రైతుల నుంచి దళారులు కొంటున్నారు. సీసీఐ కేంద్రాలు ప్రారంభం అయితే రూ. 5 వేల నుంచి రూ. 5 వేల 5 వందల వరకు మద్ధతు ధర లభిస్తుంది. కానీ సీసీఐ కేంద్రాలు ప్రారంభం కాకపోవడం, పత్తి పంట ఏరడానికి కూలీలకు డబ్బులు అవసరం పడడంతో గత్యంతతరం లేక రైతులు దళారులకు అమ్ముకుంటున్నారు.

రైతులను ముంచిన వర్షం..

జిల్లాలో ఎక్కువగా పత్తి పంట సాగు పైనే రైతులు ఆధార పడి వ్యవసాయం చేస్తున్నారు. ఈ యేడాది రైతులను ఆకాల వర్షాలు నిండా ముంచాయి. పత్తి ఏరే సమయంలో భారీ వర్షాలు పడడంతో పంటలన్నీ నీటమునిగాయి. దీంతో పత్తి పంటకు తెగుళ్లు సోకి, దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయి. అటూ ప్రకృతి, ఇటు దళారుల చేతుల్లో రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. సీసీఐ కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతులు వేడుకుంటున్నారు.



Next Story