ఆరు నెలల్లో తొమ్మిది కొత్త బైకులు : ట్రయంఫ్ ఇండియా!

by  |
ఆరు నెలల్లో తొమ్మిది కొత్త బైకులు : ట్రయంఫ్ ఇండియా!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ప్రీమియం మోటార్‌ సైకిళ్ల సంస్థ ట్రయంఫ్.. భారత మార్కెట్ లోకి రాబోయే ఆరు నెలల్లో ఉత్పత్తిని భారీగా పెంచాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తొమ్మిది కొత్త బైకు మోడళ్లను లాంచ్ చేయనున్నట్టు వెల్లడించింది. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రయంఫ్ ఇండియా 20-25 శాతం వృద్ధిని సాధిస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో సంస్థ జీరో వ్యాపారాన్ని నమోదు చేసిందని, కావున 2020 క్యాలెండర్ సంవత్సరంలో దాదాపు అమ్మకాలు ఫ్లాట్‌గా చూడొచ్చని కంపెనీ తెలిపింది. ట్రయంఫ్ సంస్థ సాధారణంగా జులై నుంచి జూన్ నెలకు ఆర్థిక సంవత్సరాన్ని లెక్కిస్తుంది.

ట్రయంఫ్ ఇండియా తన పోర్ట్‌ఫోలియోలో మోడర్న్ క్లాసిక్స్ నుంచి అడ్వెంచర్ మోటర్‌సైకిళ్ల వరకు మొత్తం 16 మోటార్‌సైకిళ్లను కలిగి ఉంది. వీటిలో ఐకానిక్ రాకెట్ 3ఆర్‌తో పాటు ఇటీవల ప్రారంభించిన రాకెట్ 3జీటీ ఉన్నాయి. ‘తాము వచ్చే ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో తొమ్మిది కొత్త మోడళ్లను విడుదల చేయబోతున్నాం. ఇందులో కొన్ని ప్రత్యేక ఎడిషన్‌లను చేర్చడం ఇదే మొదటిసారి’ అని ట్రయంఫ్ మోటార్‌ సైకిల్స్ ఇండియా బిజినెస్ హెడ్ షోయెబ్ ఫరూక్ చెప్పారు.

సరికొత్తగా విడుదల చేయబోయే మోడళ్లలో ట్రైడెంట్ 660, కొత్త టైగర్ 850 స్పోర్ట్ మోటార్‌సైకిళ్లు కూడా ఉన్నాయి. ఇవి కంపెనీ మొత్తం విక్రయాల వృద్ధికి దోహదపడనున్నాయని ఆయన పేర్కొన్నారు. మొత్తం ప్రీమియం మోటార్‌ సైకిళ్ల విభాగంలో గడిచిన 12 నెలల్లో 35-38 శాతం వృద్ధి క్షీణించిందని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు లగ్జరీ ఉత్పత్తుల కొనుగోళ్లకు దూరంగా ఉండటమే దీనికి కారణమని షోయెబ్ ఫరూక్ వెల్లడించారు.


Next Story

Most Viewed