మా జీవితాల్లో వెలుతురు ఎప్పుడొస్తుంది.. 21 ఏళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నాం..!

by  |
మా జీవితాల్లో వెలుతురు ఎప్పుడొస్తుంది.. 21 ఏళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నాం..!
X

దిశ, భద్రాచలం : మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంగా ఏర్పడి సరిగ్గా నేటితో 21 ఏళ్ళు పూర్తయింది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో బస్తర్ రాష్ట్రం డిమాండ్ కూడా ఉన్నప్పటికీ కాలక్రమేణా అది సద్దుమణిగింది.‌ 21 ఏళ్ళ స్వరాష్ట్ర పాలనలో కనీస అభివృద్ధికి నోచుకోలేదని సోమవారం వేంపురంలో జరిగిన సభలో ఆదివాసీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వేంపురం కేంద్రంగా జరిగిన సమావేశంలో 7 గ్రామపంచాయతీల పరిధిలో‌ 15 గ్రామాల నుంచి సుమారు 3 వేలమంది ఆదివాసీలు హాజరయ్యారు.

తమగోడు బాహ్య ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశ్యంతో ఈ సమావేశం న్యూస్ కవరేజ్‌కు ఆదివాసీలు ఛత్తీస్‌గఢ్, సరిహద్దు తెలంగాణ ప్రాంత మీడియాని కూడా ఆహ్వానించారు.‌ తమ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి గత 20 ఏళ్ళుగా పరిపాలిస్తున్న పాలకులే కారణమని ఆదివాసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.‌ కనీస మౌళిక సదుపాయాల కల్పనకు పాలకులు చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు.‌ మావోయిస్టులను బూచిగా చూపి ప్రభుత్వాలు తమను కష్టనష్టాలకు గురిచేస్తున్నారని ఆదివాసీలు ఆరోపించారు.

అక్రమ కేసులు, అణిచివేత వైఖరి వలన ప్రశాంత జీవనం సాగించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.‌ రోడ్లు సరిగా లేక, వైద్యం అందుబాటులోకి రాక, వెలుతురు చూడక అవస్థలు పడుతున్నామని తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఆదివాసీల ఆరోగ్యం, సంక్షేమం, మారుమూల అటవీ ప్రాంత ఆదివాసీ గ్రామాల అభివృద్ధిపై పాలకులు ఇప్పటికైనా దృష్టి పెట్టాలని ఈ వేదిక నుంచి ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.


Next Story