సిగ్నల్ ప్రాబ్లమ్స్.. క్లాసులు మిస్సింగ్..!

by  |
సిగ్నల్ ప్రాబ్లమ్స్.. క్లాసులు మిస్సింగ్..!
X

కరోనా నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలలకు వచ్చేందుకు ప్రభుత్వం అనుమతినివ్వలేదు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రత్యామ్నాయంగా ఆన్ లైన్ తరగతులను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. దూరదర్శన్, టీశాట్ ద్వారా బోధన ప్రారంభించింది. కానీ ఏజెన్సీ ఏరియాల్లో సిగ్నల్స్ సరిగ్గా రాకపోవడంతో అక్కడి విద్యార్థులకు ఆన్ లైన్ పాఠాలు అందడం లేదు. ఫలితంగా వందల సంఖ్యలో విద్యార్థులు నష్టపోతున్నారు.

దిశ, అచ్చంపేట: కరోనా కారణంగా విద్యా సంవత్సరం జూన్ లో ప్రారంభం కాకపోవడంతో ఈ విద్యా సంవత్సరం జీరో సంవత్సరంగా ఉంటుందని మొదట అందరూ భావించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కేవలం ఉపాధ్యాయలు మాత్రమే పాఠశాలకు రావాలని, విద్యార్థులు వారి ఇంటి వద్దే ఆన్ లైన్ తరగతులు వినాలని సూచించింది. పిల్లలు పాఠాలు వినేలా ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలని ఆదేశించింది. వాస్తవానికి నూటికి 60 శాతం మంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం వీటి వినియోగం చాలా వరకు తక్కువగా ఉంటుంది.

స్మార్ట్ ఫోన్, టీవీలు లేని వారు అవి ఉన్న విద్యార్థుల ఇండ్లకు వెళ్లి పాఠాలు వినాలని ఉపాధ్యాయులు సూచించడంతో అందుకు కొంత మేర విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ముందుకు వచ్చారు. కానీ నల్లమల ఏజేన్సీ ప్రాంతంలో సిగ్నల్స్ సరిగ్గా అందడం లేదు. దీని వల్ల స్మార్ట్ ఫోన్లు, టీవీల్లో పాఠాలు రావడడం లేదు. దీని వల్ల గిరిజన ప్రాంతాలకు చెందిన విద్యార్థులు నష్టపోతున్నారు. రాష్ట్రంలో ఇలాంటి ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

18 మండలాల్లో 56 గిరిజన పాఠశాలలు..

మొక్కబడిగానే విద్యా సంవత్సరాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఆన్ లైన్ పాఠాలు ప్రారంభించిందని, నష్టపోయే విద్యార్థుల గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకు ఆన్లైన్ పాఠాలు వినిపించేందుకు స్మార్ట్ ఫోన్ కొనే పరిస్థితులు లేవు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి గిరిజనులది.

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని ఐటీడీఏ పరిధిలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని ‌18 మండలాలు 56 గిరిజన పాఠశాలలు కొనసాగుతున్నాయి. నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల పరిధిలో కొనసాగుతున్న పాఠశాలలకు సంబంధించిన గ్రామాల్లో సిగ్నల్స్ రావడం లేదు. దీంతో వందల సంఖ్యలో విద్యార్థులు నషష్టపోతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలలో నష్టపోయే విద్యార్థుల సంఖ్య అత్యధికంగా ఉంది. ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని అమ్రాబాద్, పదర, లింగాల, అచ్చంపేట మండలాల్లో గిరిజన విద్యార్థులు అత్యధికంగా ఉన్నారు.

సిగ్నల్స్ లేని ప్రాంతాలు..

అమ్రాబాద్, పదర, అచ్చంపేట, లింగాల మండలాల పరిధిలో మద్దిమడుగు, మారడుగు, ఉడిమిల్ల, పిల్లి గుండు, పెట్రోల్‌చేను, భైరాపూర్, రాంపూర్, సంగిడి గుండాల, ఈర్లపెంట మేడిమలకల, కంబాలపల్లి, అక్కారం, బి కే తిరుమలాపూర్ లక్ష్మాపూర్, చన్నంపల్లి, సార్ల‌పల్లి, కుడిచింతలబైల్, తదితర గ్రామాల్లో సిగ్నల్ అందడం లేదు. ఫలితంగా విద్యార్థులకు దూరదర్శన్, టీషాట్ సేవలు అందుబాటులో లేవు. దీని వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

మా ఇంట్లో టీవీ లేదు..

నేను మన్ననూరు గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా ఇంట్లో టీవీ లేదు, పక్క వారింట్లో చూద్దామంటే సిగ్నల్ అందుబాటులో లేదు. పాఠాలు ఎలా వినాలో అర్థం కావడం లేదు.

– అంకిత, ఇంటర్ సెకండ్ ఇయర్

పాఠాలు అర్థం కావడం లేదు..

ఆన్‌‌లైన్ పాఠాలు సరిగ్గా అర్థం కావడం లేదు. సిగ్నల్స్ సైతం అప్పుడప్పుడు పోతున్నాయి. దీంతో పాఠాలు పూర్తిగా వినలేకపోతున్నాం. స్ర్కీన్ పై వచ్చిన అంశాలను రాసుకోవడానికి వీలవడం లేదు.

– జశ్వంత్, ఆరో తరగతి విద్యార్థి

ఇబ్బందులు కలుగుతున్న మాట వాస్తవమే

దూరదర్శన్, అన్ని డీటీహెచ్ ఛానల్స్‌లో తరగతుల వారిగా పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటున్న విద్యార్థులకు ఆన్‌లైన్ సౌకర్యం కొంత ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవమే. అందుకు ప్రత్యేక ఏర్పాట్లను పరిశీలిస్తున్నాం. అలాంటి ప్రదేశాలకు సంబంధించిన పాఠాలను ఉపాధ్యాయులు ఫోన్ లో రికార్డు చేసుకుని తర్వాత రోజు విద్యార్థులకు వాటిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

– అశోక్, డీటీడీఓ


Next Story

Most Viewed