అమరావతిపై విచారణ డిసెంబర్ 27కు వాయిదా 

by  |
ap-highcourt 1
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ డిసెంబర్ 27కు వాయిదా పడింది. అమరావతిపై దాఖలైన పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ఉపసంహరణ, సీఆర్డీఏ చట్టం రద్దు ఉపసంహరణకు సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది.

ఈ అఫిడవిట్‌పై హైకోర్టులో సుమారు అరగంటకు పైగా వాదనలు జరిగాయి. పిటిషనర్ల తరపున న్యాయవాదులు శ్యామ్‌దివాన్‌, సురేష్‌ వాదనలు వినిపించారు. ఉపసంహరణ బిల్లుల్లో కూడా ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని ప్రకటించిందని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి మాత్రమే రాజధాని అని.. మాస్టర్‌ ప్లాన్‌ కూడా అదే చెబుతోందని పిటిషనర్‌ తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.

ఫలితంగా ఈ పిటిషన్లపై విచారణ కొనసాగించాలేమని లాయర్లు శ్యామ్‌దివాన్‌, సురేష్‌ స్పష్టం చేశారు. వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం బిల్లులపై గవర్నర్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వలేదని.. గెజిట్‌ నోటిఫికేషన్‌ వచ్చాక విచారణ జరుపుతామని వెల్లడించింది. అయితే రాజధాని కేసుల విచారణ కారణంగా చట్టానికి లోబడి అభివృద్ధి చేసుకునేందుకు అడ్డంకిగా ఉన్న మధ్యంతర ఉత్తర్వులను తొలగిస్తున్నట్లు ధర్మాసనం తేల్చిచెప్పింది. మరోవైపు ప్రభుత్వ శాఖలు, కార్యాలయాల తరలింపుపై మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం విచారణను వచ్చే నెల 27కు ధర్మాసనం వాయిదా వేసింది.



Next Story

Most Viewed