Live Murder: నడిరోడ్డుపై న్యాయవాది దారుణ హత్య.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-11 05:54:19  IST  )

మీర్జాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మార్నింగ్ వాక్‌‌కు వెళ్లి వస్తున్న న్యాయవాదిని పట్టపగలే దుండగులు కాల్చి చంపారు.

Live Murder: నడిరోడ్డుపై న్యాయవాది దారుణ హత్య.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీయిజం, గూండాయిజం అంతమైందని ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) సీఎం యోగి ఆదిత్యనాథ్ బహిరంగ వేదికలపై చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి ఏమాత్రం మారలేదు. తాజాగా మీర్జాపూర్‌ (Mirzapur)లో ఇవాళ ఉదయం పట్టపగలే ఒక న్యాయవాదిని దుండగులు కాల్చి చంపిన ఘటన కలకలం రేపుతోంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో, ప్రజల కళ్ల ముందే ఈ దారుణం జరగడం అక్కడి శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోంది. వివరాల్లోకి వెళితే.. న్యాయవాది రాజీవ్ సింగ్ (Rajiv Singh) ఉదయం మార్నింగ్ వాక్ ముగించుకుని తిరిగి వస్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనను అడ్డుకున్నారు. నిందితుల్లో ఒకరు తన వద్ద ఉన్న నాటు తుపాకీతో రాజీవ్ సింగ్ ఛాతీలోకి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

సీసీటీవీలో నిందితుల అవస్థలు..

ఈ హత్యకు సంబంధించిన సీసీటీవీ (CCTV) ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజీవ్ సింగ్‌ను కాల్చిన తర్వాత నిందితులు పారిపోయేందుకు బైక్ ఎక్కారు. అయితే ఎంత ప్రయత్నించినా బైక్ స్టార్ట్ కాలేదు. నిందితులు పారిపోలేక బైక్‌ను నెట్టుకుంటూ వెళ్తుండగా, చుట్టుపక్కల వారు వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ, చేతిలో తుపాకీ ఉండటంతో ఎవరూ దగ్గరకు వెళ్లలేకపోయారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత చివరకు బైక్ స్టార్ట్ అవ్వడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై మీర్జాపూర్ ఎస్పీ అపర్ణ రజత్ కౌశిక్ (SP Aparna Rajat Kaushik) మాట్లాడుతూ.. మృతుడు రాజీవ్ సింగ్ గతంలో ఓ గ్రామానికి సర్పంచ్‌గా కూడా పనిచేశారని తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే పక్కా ప్లాన్ ప్రకారం అతడిని హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నామని అన్నారు. సీసీటీవీలో నిందితుల ముఖాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో వారిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని ఎస్పీ తెలిపారు.

Next Story