కరోనా వేళ ట్రాన్స్‌జెండర్ల కొత్త డిమాండ్.. ఏంటో తెలుసా..?

by  |
కరోనా వేళ ట్రాన్స్‌జెండర్ల కొత్త డిమాండ్.. ఏంటో తెలుసా..?
X

రాంచీ : దేశంలో కొవిడ్ విజృంభిస్తున్న వేళ కుల, మత, జాతి, లింగ బేధాలు లేకుండా కరోనా సోకినవారంతా ఆస్పత్రుల పాలవుతున్నారు. అయితే హాస్పిటల్స్‌లో తమకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని జార్ఖండ్‌లో ట్రాన్స్‌జెండర్లు డిమాండ్ చేస్తున్నారు. పురుషుల వార్డులో గానీ, మహిళల వార్డులో గానీ తాము ఉండమని, తమకోసం ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనిపై సోమవారం రాష్ట్ర రాజధాని రాంచీ లోని జార్ఖండ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (జల్సా) కార్యాలయం వద్ద సమావేశమై తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందుంచారు.

పలు రాష్ట్రాల్లో ట్రాన్స్‌జెండర్ల కోసం ఆస్పత్రులలో ప్రత్యేకంగా వార్డులను ఏర్పాటు చేశారని కానీ జార్ఖండ్ లో మాత్రం అందుకు సంబంధించిన పనులేవీ జరగడం లేదని ఆరోపించారు. కొవిడ్ బారిన పడ్డ ట్రాన్స్‌జెండర్స్‌ను కూడా హాస్పిటల్స్ లో మెన్స్, ఉమెన్స్ వార్డులలో వేసి చికిత్స చేస్తున్నారని, ఇది తమకు ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకోసం ప్రత్యేకమైన బాత్‌రూంలు కూడా లేవని తెలిపారు.

ఇదే విషయమై బొకారోకు చెందిన అమర్‌జిత్ కిన్నర్ స్పందిస్తూ.. ‘పురుషులు, మహిళలు ఉండే క్వారంటైన్ సెంటర్లు, ఆస్పత్రులలో మమ్మల్ని ఉంచుతున్నారు. ఇది మాకు ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం మాకోసం హాస్పిటల్స్‌లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి. ఇరుగు పొరుగు రాష్ట్రాలలో ఇలాంటి సౌకర్యాలున్నాయి. కానీ జార్ఖండ్ లో మాత్రం అందుకు సంబంధించిన పనులేవీ ముందుకు సాగడం లేదు. ఆడ, మగతో పాటు మాకు కూడా అన్ని హక్కులను కల్పిస్తూ 2014లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా జార్ఖండ్ ప్రభుత్వం మాత్రం దానిని పాటించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని మా హక్కులను కాపాడాలి’ అని అన్నారు. తాము కూడా ఈ సమాజంలో భాగమేనన్న సంగతి మరిచిపోవద్దని అమర్‌జిత్ తెలిపారు.

Next Story

Most Viewed