జూన్ 1 నుంచి రైళ్ళ రాకపోకలు.. ఆన్‌లైన్‌లోనే టికెట్లు

by  |
జూన్ 1 నుంచి రైళ్ళ రాకపోకలు.. ఆన్‌లైన్‌లోనే టికెట్లు
X

దిశ, న్యూస్ బ్యూరో: దేశంలోని వివిధ ప్రధాన నగరాల మధ్య జూన్ 1వ తేదీ నుంచి రైలు సర్వీసులు ప్రారంభించనున్నట్టు రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుతానికి ప్రతిరోజూ 200 నాన్-ఏసీ రైళ్ళు మాత్రమే నడుస్తాయని, ఏయే స్టేషన్ల మధ్య నడిచేదీ త్వరలోనే వెల్లడించనున్నట్టు పేర్కొంది. రైల్వే స్టేషన్లలో కౌంటర్ల ద్వారా టికెట్ల విక్రయం ఉండదని, కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే టికెట్లను బుక్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇప్పటివరకూ శ్రామిక్ స్పెషల్ రైలు సర్వీసులను మాత్రమే నడుపుతున్న రైల్వే శాఖ జూన్ 1 నుంచి సామాన్య ప్రయాణీకులకు కూడా నడపనుంది. ఈ రైలు సర్వీసుల టైమ్ టేబుల్ త్వరలో విడుదల కానుంది. జూన్ 30 వరకూ రైలు సర్వీసులు ఉండవని, ఇప్పటికే రిజర్వు చేసుకున్న ప్రయాణీకులకు పూర్తి డబ్బుల్ని వాపసు చేస్తామని గత వారం ప్రకటించిన రైల్వే శాఖ ఇప్పుడు పరిమిత సంఖ్యలో రైలు సర్వీసులను ప్రారంభిస్తోంది.

వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు తరలించడానికి 19 రోజుల వ్యవధిలో 1600 స్పెషల్ రైళ్ళను నడిపినట్టు రైల్వే మంత్రిత్వశాఖ వివరించింది. ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో అలాంటి వలస కార్మికులు ఉన్నారని, జాతీయ రహదారుల మీదుగా నడిచుకుంటూ సొంతూళ్ళకు వెళ్తున్నారని, ఇకపైన ఇలాంటి ఇబ్బందులు లేకుండా సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్‌కు వెళ్ళి పేర్లను నమోదు చేసుకుంటే రైల్వే అధికారులే వారిని స్వస్థలాలకు చేరవేస్తారని ఆ ప్రకటన స్పష్టం చేసింది. రాష్ట్రాల నోడల్ అధికారుల దగ్గర పేర్లు నమోదు చేసుకున్నవారితో పాటు రైల్వే స్టేషన్లలో నమోదు చేసుకున్నవారిని కూడా తరలిస్తామని స్పష్టం చేసింది. ఇకపైన రాష్ట్రాలతో సంబంధం లేకుండా రైల్వే శాఖ ద్వారానే సొంతూళ్ళకు పంపే ఏర్పాట్లు చేయనున్నట్టు స్పష్టం చేసింది. వలస కార్మికులు పూర్తిగా వారి సొంతూళ్ళకు చేరుకునేంత వరకూ అవసరాలకు అనుగుణంగా ప్రతీరోజు 200 చొప్పున వారి కోసమే శ్రామిక్ స్పెషల్ రైళ్ళను నడపనున్నట్టు తెలిపింది.


Next Story

Most Viewed