గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ

by  |
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ
X

దిశ, ఏపీ బ్యూరో: కొత్తగా ఏర్పడ్డ గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో సిబ్బందికి డిజిటల్ సేవలపై మరింత అవగాహన పెంచేందుకు నవంబరు 3 నుంచి 12 వరకు శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది. క్షేత్ర స్థాయిలో ప్రజలకు మరింత మెరుగ్గా సేవలు అందించేందుకు ఈ శిక్షణా తరగతులు అవసరమని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌ జైన్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

గుంటూరు జిల్లాలోని కేఎల్ యూనివర్సిటీలో జరిగే ఈ శిక్షణా తరగతులకు జిల్లాల వారీ సంబంధిత సిబ్బంది తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన జాయింట్ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. మండలానికి ఒకరు చొప్పున డిజిటల్ అసిస్టెంట్లు ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొంటారు. వీరితోపాటు వార్డు ఎడ్యుకేషన్‌ అండ్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీలు మున్సిపాలిటీ, నగర పంచాయితీ నుంచి ఒకరు, కార్పొరేషన్ల నుంచి ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున పాల్గొంటారు. ఏపీ ఆన్ లైన్ టెక్నికల్ టీమ్ నుంచి జిల్లా ఇద్దరు చొప్పున కో ఆర్డినేటర్లు పాల్గొంటారు.

3, 4 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలకు, 5, 6 తేదీల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు, 9, 10 తేదీల్లో అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు, 11, 12 తేదీల్లో కడప జిల్లా సిబ్బందికి ఈ శిక్షణా తరగతులు జరగనున్నాయి. ఒక్కో బ్యాచ్ లో రెండు వందల మందికి మొత్తం నాలుగు బ్యాచుల్లో ఎనిమిది వందల మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని జాయింట్ కమిషనర్‌ రామ్‌నాథ్‌ రెడ్డి పర్యవేక్షిస్తారు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని పిలిపించి గ్రామ, వార్డు సచివాలయాల్లో సాంకేతికంగా ఎదురవుతున్న అనేక సమస్యలపై అవగాహన కల్పిస్తారు.

Next Story