బాండ్లు అమ్మిన సొమ్ములేవీ ?

by  |
బాండ్లు అమ్మిన సొమ్ములేవీ ?
X

దిశ, న్యూస్‌బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం బాండ్లు అమ్మగా వచ్చిన రూ.1,500 కోట్లు ఏమయ్యాయో చెప్పాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ హాల్‌‌లో బుధవారం కరోనా వైరస్ నియంత్రణ, ప్రభుత్వ పనితీరుపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీటీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం, ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్‌లు హాజరయ్యారు.

సమావేశం అనంతరం ఉత్తమ్ కుమార్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ కారణంగా రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన వారి కంటే ఎక్కువ మంది చనిపోయే పరిస్థితి ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారన్నారు. కేసీఆర్ వ్యవహార శైలి వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని, ఒక్క వారం పాటు లాక్‌డౌన్ ఉంటేనే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం బాండ్లు విక్రయించగా వచ్చిన రూ.1500 కోట్ల రూపాయలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ఉత్తమ్ ప్రశ్నించారు. మీడియా సెల్ఫ్ రిస్ట్రిక్ట్ పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల వార్తలు రాయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. పేదలకు ఉచిత బియ్యంతో పాటు ఆర్థిక సాయం అందజేస్తామని మార్చి 22వ తేదీన ప్రకటించినా.. నేటికీ అందలేదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 కిలోల బియ్యంతో కలుపుకొనే రాష్ట్ర ప్రభుత్వం 12 కిలోల బియ్యం ఇస్తుందా అన్న దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కోదండరాం మాట్లాడుతూ.. కరోనా‌కి లాక్‌డౌన్ ఒక్కటే సరిపోదు, ఏరియా ఆస్పత్రుల అభివృద్ధితో పాటు 104, 108 అంబులెన్స్‌లు పునరుద్ధరించాలని, మినరల్ ఫండ్ వినియోగించాలని కోరారు. రేషన్ కార్డు‌తో సంబంధం లేకుండా మానవత్వం‌తో ప్రతి ఒక్కరికీ రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే రెండు నెలలకి ప్రతి కుటుంబానికి రూ.5 వేలు అందజేయాలన్నారు. ఇంటి అద్దెల చెల్లింపులు వాయిదా వేస్తూ ఆర్డర్ తేవాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ చర్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాసినా పట్టించుకోలేదని, ఆపత్కాల సమయంలో ప్రభుత్వం అందరినీ కలుపుకొనిపోతే వచ్చే నష్టమేమిటని ప్రశ్నించారు. వలస కార్మికుల జీవన పరిస్థితి దారుణంగా ఉండటంతో వాళ్ళు రోడ్ల మీదికొచ్చి ధర్నా చేసే దుస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా ప్రజా సంక్షేమంరీత్యా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Tags : All Party Meeting, Uttam Kumar Reddy, Kodandaram, Chada Venkat Reddy, Bonds



Next Story

Most Viewed