రాజకీయాలు కమర్షియల్ అయ్యాయి : ఉత్తమ్‌

by  |
TPCC chief Uttam Kumar Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయాలు చాలా కమర్షియల్​అయ్యాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు చిన్నారెడ్డి (హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్), రాములు నాయక్‌ (వరంగల్-ఖమ్మం-నల్గొండ)కు బీ ఫారాలను సోమవారం అందజేశారు. అనంతరం మీడియాతో ఉత్తమ్ మాట్లాడుతూ రాజకీయాలను వ్యాపారంగా చూడని వారినే ఎన్నుకోవాలన్నారు. నిరుద్యోగులకు టీఆర్ఎస్ చేసిందేమీ లేదని విమర్శించారు. ఒక్కరోజు సైతం నిరుద్యోగుల గురించి మాట్లాడలేదని, ఒక్క రూపాయి పని కూడా చేయలేదని టీఆర్‌ఎస్​సిట్టింగ్​ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక విద్యా వ్యాపారి తన విద్యా సంస్థలను పెంచుకున్నాడని, చిన్న కాలేజీ నుంచి ప్రైవేట్ యూనివర్సిటీని చేసుకునే స్థాయికి ఎమ్మెల్సీ పదవిని ఉపయోగించుకున్నాడని ఆరోపించారు. హైదరాబాద్​ స్థానంలోని సిట్టింగ్​ఎమ్మెల్సీ రామచంద్రారావు (బీజేపీ) సైతం నిరుద్యోగుల కోసం ఒక్క పనీ చేయలేదని విమర్శించారు.

తీరా గ్రాడ్యుయేట్స్ ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తామని కేటీఆర్ ప్రకటించారని కానీ, ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అయోధ్య రామ మందిరానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. భద్రాచలం ఆలయ భూములు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది కేంద్రమేనన్నారు. రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్​అభ్యర్థులను గెలిపిస్తే శాసనమండలిలో గొంతు వినిపిస్తారని, ఉద్యోగస్తులు, నిరుద్యోగుల తరుపున పోరాడుతారని వెల్లడించారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.

Next Story