చంపింది వాళ్లే.. ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

by  |
Uttam Kumar Reddy
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: నడిరోడ్డుపై న్యాయవాది దంపతుల హత్య జరగడం చాలా బాధాకరమని, బాధిత కుటుంబానికి కాంగ్రెస్ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా గుంజపడుగలో వామనరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వామన్‌రావు దంపతులను హత్య చేసింది ముమ్మాటికీ టీఆర్ఎస్ పార్టీ నేతలేనని, స్థానిక పోలీసుల పాత్ర కూడా ఉందని ఆరోపించారు.

గతంలోనే వామన్ రావు కుటుంబానికి రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించినా మంథని పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు. మంథనిలో ఇసుక మాఫియా రూ.వేల కోట్లు సంపాదిస్తోందని, ఇందులో స్థానిక నేతల నుంచి పైస్థాయి వరకు మామూళ్లు అందుతున్నాయని ఆరోపించారు. ఇంతవరకూ కనీస మానవత్వంతో సీఎం కేసీఆర్ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ విచారణ జరిపితేనే హత్యలో అసలు నిందితులు ఎవరో బయటపడతారని, లేకపోతే కేసు నీరుగారిపోతుందన్నారు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. వామన్ రావు దంపతుల హత్య కేసులో అమాయకులను బలి చేయవద్దని కోరారు. ఈ హత్యలను కూడా టీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా వాడుకుంటోందని మండిపడ్డారు.


Next Story

Most Viewed