వైజాగ్ ఘటన హృదయ విదారకరం – సినీ ప్రముఖులు

by  |
వైజాగ్ ఘటన హృదయ విదారకరం –  సినీ ప్రముఖులు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి వెలువడిన విషవాయువు నిద్రమత్తులో ఉన్న వారి ప్రాణాలు తీసింది. అధిక గాఢ‌త క‌లిగిన పీవీసీ(పాలీవినైల్‌ క్లోరైడ్‌) వాయివుని పీల్చిన ప్ర‌జ‌లు శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. చెట్లన్నీ మాడిపోయాయి. మూగజీవాలన్నీచనిపోయాయి. ఎటూ చూసిన హృదయ విదారక దృశ్యాలే కనిపించాయి. ఈ దుర్ఘటనలో ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ది మంది మృతి చెంద‌గా, కొంద‌రు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు త‌మ ట్విట్ట‌ర్ ద్వారా విచారం వ్యక్తం చేస్తున్నారు.

‘‘విశాఖ లో విషవాయువు స్టెరిన్ బారినపడి ప్రజలు మరణించటం మనసుని కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురైన వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను. లాక్‌డౌన్ త‌ర్వాత ఇండ‌స్ట్రీలు ఓపెన్ చేసేముందు జాగ్ర‌త్త‌లు వ‌హించండి’’ అని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలిపారు.

‘‘వైజాగ్ గ్యాస్ లీక్ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రభావిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వైజాగ్ ప్ర‌జ‌లు ధైర్యంగా ఉండండి’’అని ఎన్టీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘‘ఈ వార్త నా హృదయాన్ని ముక్కలు చేసింది. నా జీవితంలో వైజాగ్ నగరానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ దుర్భటన నన్ను చాలా బాధిస్తోంది. చనిపోయిన వారికీ నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలి’ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

‘‘గ్యాస్ లీక్ వార్తతో చాలా డిస్టర్బ్ అయ్యాను. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. అస్వస్థతకు గురైన వారంతా త్వరగా కోలుకోవాలి. మీరంతా క్షేమంగా ఉండాలి’ – రవితేజ

‘‘గ్యాస్ లీకేజీ వల్ల అస్వస్థకు గురైన బాధిత ప్రజల కోసం నేను ప్రార్థిస్తున్నాను. అందరూ క్షేమంగా ఉంటారని ఆశిస్తున్నాను’ – నాగశౌర్య

‘‘వైజాగ్ వార్త నా మ‌న‌సుని తీవ్రంగా బాధపెట్టింది. ఇలాంటి కఠిన ప‌రిస్థితుల‌లో ఇలా జరగడం విచారకరం. ప్రాణాలు కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. బాధితులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని నేను ప్రార్ధిస్తున్నాను. స్టే సేఫ్ వైజాగ్’అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

‘‘విశాఖ దుర్ఘ‌ట‌న హృద‌య‌విదార‌కం.. కాలుష్య నియంత్రణ మండలి కఠినంగా వ్యవహరించాలి .విశాఖపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువులు విడుదలై 5 కిలోమీటర్ల మేర ప్రజల భయకంపితులు కావడం… 8 మంది మృతి చెందటం… వందల మంది తీవ్ర అస్వస్థతకు లోనవడం హృదయవిదారకం. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. అస్వస్థతకు గురైనవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి ’’ అని ప‌వ‌న్ పేర్కొన్నారు

‘‘వైజాగ్ గ్యాస్ లీక్‌కి సంబంధించిన ఫోటోలు హృద‌యాన్ని కలిచివేసేవిగా ఉన్నాయి. మ‌ర‌ణించిన వారి కుటుంబాలకు నా సంతాపం తెలియ‌జేస్తున్నాను. బాధిత ప్రజలు కోలుకునేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. బాధిత ప్రజల కోసం నేను ప్రార్థిస్తున్నాను’ అని చ‌ర‌ణ్ పేర్కొన్నారు.

‘‘ కరోనా సంక్షోభ స‌మ‌యంలో వైజాగ్ గ్యాస్ లీక్ వార్త తెలుసుకొని చాలా బాధ‌ప‌డ్డాను. ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబాలకు నా సంతాపం తెలియ‌జేస్తున్నాను. ఆసుప‌త్రిలో చికిత్స పొందేవారు త్వరగా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నాను’’ అని వెంక‌టేష్ తన బాధను ట్వట్టర్ ద్వారా వ్యక్తం చేశారు.

‘‘ఈ ఘటన హృదయ విదారకం. మనమంతా హెల్ప్ లెస్. మనమంతా ఉన్నది వారి క్షేమం కోసం ప్రార్థించడానికే’’ – నాని

రామ్ పోతినేని, సాయి ధరమ్ తేజ, వరుణ్ తేజ్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, నిఖిల్, శ్రీకాంత్, అల్లరి నరేష్, సునీల్, డైరెక్టర్ మారుతి, డైరెక్టర్ బాబీ, సురేందర్ రెడ్డి, ఇలా సినీ పరిశ్రమకు చెందిన వారంతా తమ గ్యాస్ లీకేజీలో ప్రాణాలు కోల్పోయిన వారికి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు

tags: cinema, vizag gas leak, lg polymers, hollywood celebrities


Next Story

Most Viewed