గ్రేటర్ ప్రచారానికి తెర

by  |
గ్రేటర్ ప్రచారానికి తెర
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ మహాపోరులో ప్రధాన ఘట్టానికి నేటితో తెర పడనుంది. ఈనెల 22న బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు వెల్లడైన వెంటనే ప్రచారం మొదలైంది. గ్రేటర్ ప్రచారంలో ఈసారి పార్టీల తరపున ముఖ్యనేతలంతా విస్తృత ప్రచారం చేశారు. అధికార పార్టీ తరపున రాష్ట్ర మంత్రులు డివిజన్లలో మకాం వేశారు. శనివారం సీఎం కేసీఆర్​ ఎల్‌బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించారు.

ఇతర జిల్లాల నుంచి తీసుకువచ్చిన కార్యకర్తలతో హైదరాబాద్ మొత్తం నిండిపోయింది. స్థానిక నేతల కంటే ఇతర జిల్లాల నుంచి వచ్చిన నేతలే ఎక్కువగా ప్రచారం చేశారు. బీజేపీ నుంచి కేంద్రమంత్రులు వచ్చి ప్రచారం చేశారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, కిషన్‌రెడ్డితో పాటు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్యతో సహా రాష్ట్ర నేతలు ప్రచారం చేశారు. ఇక ఈ రోజు అమిత్‌ షా ప్రచారం నిర్వహించనున్నారు.

కాగా, గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం 6 గంటలకు పరిసమాప్తం కానుంది. ఈ మేరకు సాయంత్రం వరకు ప్రచారపర్వాన్ని ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. గ్రేటర్‌ పరిధిలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనలను పాటించని రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, ప్రచార నిర్వాహకులపై చర్యలు తప్పవని ఎన్నికల సంఘం కమిషనర్​ పార్థసారథి పేర్కొన్నారు.

జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ 1955 ప్రకారం రెండు సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందన్నారు. వచ్చే 48 గంటల్లో ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ విధించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.

Next Story