భారత్ నెట్ ప్రాజెక్టు ఏపీలో ఏ మేరకు అమలైంది..?

by  |
nellurump
X

దిశ, ఏపీ బ్యూరో: భారత్ నెట్ ప్రాజెక్టు కింద ఏపీలో బ్రాడ్ బ్యాండ్ సేవలు ఏ మేరకు అందుబాటులోకి వచ్చాయని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బుధవారం పార్లమెంట్‌లో ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు రెండు దశల్లో కార్యాచరణ అమలు తీరు ఎలా ఉందని అడిగారు. దీనికి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి దేవ్ సింగ్ చౌహాన్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. భారత్ నెట్ ప్రాజెక్టును ఏపీతో సహా దేశంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ అమలు చేయడానికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పి.జి.సి.ఐ.ఎల్) ద్వారా మొదటి దశ కింద మొత్తం 1692 గ్రామ పంచాయతీల్లో అమలు చేయాలని నిర్ణయించాం. అందులో ఈ ఏడాది నవంబర్ ఒకటో తేదీ నాటికి 1681 గ్రామ పంచాయతీలు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో రెండో దశ కింద 11,719 గ్రామ పంచాయతీల్లో 27 గ్రామపంచాయతీలు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

శాటిలైట్ మీడియాలో 15 గ్రామ పంచాయతీల్లో అమలు చేయాలని నిర్ణయించాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 1708 గ్రామ పంచాయతీలు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర మంత్రి దేవ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు అమలును వేగవంతం చేసేందుకు గాను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(డి.ఓ.టి), భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ (బి.బి.ఎన్.ఎల్) నిశితంగా పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధిత ఏజెన్సీతో క్రమం తప్పకుండా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో 940, ప్రకాశం జిల్లాలో 1028 పంచాయతీలు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి దేవ్ సింగ్ చౌహాన్ సమాధానమిచ్చారు.


Next Story

Most Viewed