వరంగల్ ఖాళీ అవుతోంది.. కారణం..?

by  |
వరంగల్ ఖాళీ అవుతోంది.. కారణం..?
X

దిశ ప్రతినిధి, వరంగల్: కరోనా దెబ్బకు జనమంతా వరంగల్ వదిలి సొంతూరి బాట పడుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో కిరాయి ఇండ్లల్లో ఉన్నవారు గ్రామాలకు వెళ్లిపోతున్నారు. దీంతో వరంగల్ ట్రైసిటీలోని ఇళ్ల గేట్లకు టు లెట్ బోర్డులు వేలాడుతున్నాయి. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో వరంగల్, ఖాజీపేట, హన్మకొండ పట్టణాలున్నాయి. వరంగల్ పరిధిలో 58 డివిజన్లలో 2.55 లక్షల ఇండ్లుండగా, 11.45 లక్షల మంది జనాభా ఉన్నట్లు మున్సి పల్ అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఇప్పటికే స్టూడెంట్లు ఖాళీ చేసి వెళ్లిపోగా.. ఉద్యోగులు, చిరు వ్యాపారులు, కూలీలు ఇంటి బాట పట్టారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తుండడంతో అన్ని వర్గాల ప్రజలు సొంతూళ్లకు వెళ్లి పోతున్నారు. హాస్టళ్లు, అపార్ట్‌మెంట్స్, బిల్డింగ్‌లు జనం లేక బోసి పోతున్నాయి.

బోసిపోతున్న నగరం..

వరంగల్ నగరంలో హన్మకొండ విద్యా సంస్థలకు నిలయంగా ఉంది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీతో పాటు కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. దీంతో స్టూడెంట్లు ఎక్కువ సంఖ్యలో సిటీలో ఇండ్లు అద్దెకు తీసుకుని ఉన్నారు. ప్రధానంగా కిషన్ పుర, నయీంనగర్, కుమార్‌పల్లి, విద్యానగర్, గోపాల్ పురం, రెడ్డి కాలనీ, రాం నగర్, పోచమ్మ మైదాన్, గిర్మాజీ పేటలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇళ్లను కిరాయి తీసుకుని ఉంటారు. డిమాండ్ పెరగడంతో ఒక్క గదికే రూ.3వేల నుంచి రూ.4 వేల వరకు, సింగిల్‌ బెడ్‌ రూంకు రూ.5వేల నుంచి రూ.7వేల వరకు, డబుల్‌ బెడ్‌ రూంలకు రూ.10వేల నుంచి రూ.20 వేలు వరకు డిమాండ్ చేశారు. కాగా, వీరంతా లాక్‌డౌన్ మొదట్లోనే ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. వరంగల్ ట్రైసిటీలో సగానికిపైగా విద్యాసంస్థలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రభుత్వం కళాశాలలకు అనుమతి ఇవ్వక పోవటం వల్ల స్టూడెంట్లు రావడం లేదు. స్కూళ్లు, కాలేజీలు నడవడం లేదు. పలు యాజమాన్యాలు భవనాలకు అద్దెలు చెల్లించలేక కొందరు పూర్తిగా మూసి వేస్తున్నారు. రెండు నెలల కాలంలో అయినా విద్యాసంస్థలు తెరుచుకుంటాయని భావించిన కొందరు టీచర్లు, స్టూడెంట్లు రెంట్లు కడుతూ వచ్చారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటుందో తెలీక ఇండ్లను ఖాళీ చేస్తున్నారు. కరోనా కారణంగా ప్రైవేటు సంస్థలు, పలు కంపెనీలు కూడా మూతపడ్డాయి. కూలీలకు పనులు దొరకక వ్యాపార అవకాశాలు లేక ప్రైవేటు ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు ఆదాయం లేక ఇంటి కిరాయి చెల్లించలేని స్థితిలో సొంతూళ్లకు వెళ్లి పోతున్నారు. దీంతో ఇంటి యాజమానులు తప్పదన్నట్లుగా గేట్లకు టు లెట్ బోర్డులు తగిలిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో సగం వరకు ఇండ్లన్నీ టు లెట్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి.

Next Story

Most Viewed