ఆ టీకాలపై మూడు రోజుల్లో నిర్ణయం

by  |
ఆ టీకాలపై మూడు రోజుల్లో నిర్ణయం
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విదేశీ టీకాల అనుమతి ప్రక్రియను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంది. విదేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన టీకాలు లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ జాబితాలోని టీకాలను మనదేశంలో అనుమతించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. టీకా తయారీదారులు అత్యవసర అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆమోదంపై మూడు పనిదినాల్లో డీసీజీఐ నిర్ణయం తీసుకుంటుందని కేంద్రం గురువారం వెల్లడించింది. ఒకవేళ అత్యవసర వినియోగానికి అనుమతి పొందితే, సదరు టీకా తయారీదారు మనదేశంలో ఓవర్సీస్ మ్యానుఫ్యాక్చరింగ్, దిగుమతులకు మరో మూడు రోజుల్లో ఆమోదం పొందుతారని వివరించింది. విదేశీ టీకాల అనుమతిపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రక్రియ విధానాన్ని రూపొందించింది. ఇందుకు అనుగుణంగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌‌సీవో) మార్గదర్శకాలను వెబ్‌సైట్‌లో పొందుపరించింది.

ఇక్కడ అత్యవసర వినియోగ అనుమతి కోసం విదేశీ టీకాతయారీదారు మనదేశ సబ్సిడరీ, లేదా అధికారిక ఏజెంట్ ద్వారా సీడీఎస్‌సీవోకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిపై మూడు రోజుల్లో్ డీసీజీఐ నిర్ణయం తీసుకుంటుంది. భారత టీకా కార్యక్రమ నిబంధనలకు అనుగుణంగా పంపిణీ చేయాల్సి ఉంటుందన్న షరతుతో ఈ అనుమతినిస్తుంది. అనంతరం వారం రోజులపాటు వందమందిపై ఈ టీకా సేఫ్టీని పరిశీలిస్తారు. ఈ ఫలితాలు సంతృప్తికరంగా వస్తే పంపిణీకి అనుమతిస్తారు. సాధారణంగా ఇప్పటి వరకు విదేశీ టీకాలు మనదేశంలోనూ ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే కేంద్రం అనుమతినిచ్చేది. తాజాగా, అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చి అటుతర్వాత సమాంతరంగా ట్రయల్స్ నిర్వహించాలని ఆదేశిస్తున్నది. వారంలో ట్రయల్స్ ప్రొటోకాల్‌ను జారీ చేస్తుంది. ఈ ప్రొటోకాల్‌లో నిర్దేశించిన టైమ్‌లైన్‌కు లోబడి ట్రయల్స్ నిర్వహించాలి. ఈ ఫలితాలను సీడీఎస్‌సీవోకు సమర్పించాలి. ఈ ఫలితాలను పరిశీలించి సదరు టీకాకు ఇచ్చిన అనుమతులను సమీక్షిస్తుంది.

Next Story