మూగజీవాలను కాపాడబోయి అనంతలోకాలకు..

by  |
మూగజీవాలను కాపాడబోయి అనంతలోకాలకు..
X

దిశ, బోధన్: నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. మూగజీవాలను కాపాడేందుకు చెరువులో దిగిన ఓ వ్యక్తి ఈత రాక నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జిల్లాలోని బోధన్ మండలంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. బోధన్ రూరల్ ఎస్ఐ భువనేశ్వర్ కథనం ప్రకారం.. బర్రెలను తోలుకుని ఊర చెరువుకు వెళ్లిన బక్కొల్ల తిరుపతి(29) ఈత రాక నీటిలో మునిగి చనిపోయాడు.

అంతముందుకు మూగజీవాలు చెరువులోకి దిగాయి. మెల్లమెల్లగా అవి నీటి లోతు ఎక్కువగా ఉండే ప్రదేశానికి వెళ్తున్న క్రమంలో వాటిని అదుపు చేసేందుకు తిరుపతి చెరువులోకి దిగాడు. వాటిని దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తుండగా తెలియకుండానే లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశానికి చేరుకుని నీటిలో ఇరుక్కుపోయాడు. అతనికి ఈత రాకపోవడంతో అందులో మునిగిపోయి మరణించాడు.

మృతుడి వెంట అతని స్నేహితుడు గంగాధర్‌ ఉండగా అతనికి కూడా ఈత రాకపోవడంతో గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు గజ ఈతగాళ్ల సాయంతో తిరుపతిని బయటకు తీసి చూసేసరికి అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. కాగా, మృతుడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. విషయం తెలియడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.

Next Story