వైసీపీ గెలిస్తే తిరుమల ఏడుకొండలను కూడా అమ్మేస్తారు : రామ్మోహన్ నాయుడు

by  |
MP Rammohan Naidu
X

దిశ, వెబ్‌డెస్క్ : సీఎం జగన్‌పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన జగన్ మూడు రాజధానుల పేరిట విశాఖలో ప్రభుత్వ భూములను అమ్ముతున్నాడని ఆరోపించారు. తిరుపతిలో వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే తిరుపతి భూములనే కాదు.. తిరుమల ఏడు కొండలను కూడా అమ్ముకునే ప్రమాదం ఉందని ప్రజలను హెచ్చించారు. ఏపీ అభివృద్ధి కోసం ఏనాడు కేంద్రానికి లేఖలు రాయని సీఎం జగన్.. ఓట్ల కోసం తిరుపతి అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని ఇంటింటికి లేఖలు రాస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తానని 22 మంది ఎంపీలను గెలుచుకున్న జగన్.. ఆయన పాద సేవ చేసుకోవడానికి మరో ఎంపీని గెలిపించాలని కోరుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ప్రశ్నిస్తే మోడీ. జగన్ ను జైల్లో పెడతారని ఎంపీలు భయపడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే ప్రశ్నించేది టీడీపీయేనని గుర్తు చేశారు. తిరుపతిలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలని రామ్మోహన్ నాయుడు ఓటర్లను అభ్యర్థించారు.


Next Story

Most Viewed