ఇసుకపాడులో పులి టెన్షన్..

by  |
ఇసుకపాడులో పులి టెన్షన్..
X

దిశ, కుకునూరు : పశ్చిమ ఏజెన్సీపై పులి పంజా విసిరింది. కుకునూరు, వేలేరుపాడు ఏజెన్సీలో పశువులపై పులి దాడులు పెరిగాయి. వారం రోజులుగా పులి గాడ్రింపులు దడపుట్టిస్తున్నాయి. ప్రజలు, రైతులు, అధికారుల్లో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వరుసగా పులి పశువులను హతమార్చడంతో కుకునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా కుకునూరు మండలం ఇసుకపాడు గ్రామ సమీపాన పులి మంగళవారం తెల్లవారు జామున కంటిపల్లి నాగులు అనే రైతుకు చెందిన పశువుల పాకపై దాడి చేసింది. ఒక ఎద్దును చంపి కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లి ఎద్దు వెనుక భాగాన్ని కొంత తిని వదిలివేసింది. మంగళవారం ఉదయం రైతు పశువుల పాక వద్దకు వెళ్లగా పాక చెల్లాచెదురై సుమారు 30 పశువులు కన్పించలేదు.

గ్రామస్తులతో రైతు చుట్టుపక్కల వెతకగా పులి తినిపడేసిన ఎద్దు మృతదేహం లభ్యంమైంది. కాగా సమాచారం తెలుసుకున్న కుకునూరు, అమరవరం రేంజ్ అధికారులు ఏడుకొండలు ,శ్రీనివాసరావు, కుకునూరు సీఐ బాలసురేషబాబు, ఎస్సై పైడిబాబు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పులి పాదముద్రలను సేకరించారు. కాగా ఈ విషయమై కుకునూరు రేంజ్ అధికారి ఏడుకొండలను వివరణ కోరగా పశువుల పై దాడి చేసింది పెద్దపులా, చిరుతపులా అన్న దానిపై పాదముద్రల ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నామన్నారు. అడవుల్లో బుధవారం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని, పదిహేను రోజుల వరకు ఎవరూ అడవుల్లోకి వెళ్లవద్దని, ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

Next Story