దుబ్బాకలో త్రిముఖ పోరు !

by  |
దుబ్బాకలో త్రిముఖ పోరు !
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎన్నికల వాతావరణం నెలకొంది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంతో బై ఎలక్షన్ కన్ఫామై రాష్ట్ర రాజకీయం మొత్తం నియోజకవర్గంపై కేంద్రీకృతం అయ్యింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినందున కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను నిలుపుతాయా అన్నది ఆసక్తికరంగా ఉండేది. కానీ 2014లో గెలిచిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చనిపోతే టీఆర్ఎస్ అభ్యర్థులను నిలిపి సీట్లు కైవసం చేసుకుంది. దీంతో గతాన్ని గుర్తు పెట్టుకున్న హస్తంపార్టీ ఉపఎన్నికకు సై అనడంతో బీజేపీ నుంచి సైతం అదే మాట వినపడుతోంది. దీంతో దుబ్బాక నియోజకవర్గ ఉపఎన్నికలో త్రిముఖ పోరు నెలకొంది.

వారంక్రితం పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెడుతుందని, ఇది పార్టీ నిర్ణయమని స్పష్టం చేశారు. ఉపఎన్నికపై పార్టీలో ఇతర నేతలు మాట్లాడితే అది వారి వ్యక్తిగతం అవుతుందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయం అని మేం చెబుతుంటే అక్కడ అభ్యర్థిని నిలపకుండా ఎలా ఉంటామని నొక్కి చెప్పారు. గతంలో నారాయణఖేడ్, పాలేరులో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చనిపోతే టీఆర్ఎస్ ఏమాత్రం ఆలోచించకుండా అభ్యర్థులను పెట్టి గెలిచిందన్నారు. దీంతో మండలాల వారీగా సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలని పీసీసీ చీఫ్ జిల్లా అధ్యక్షుడికి ఆదేశాలు జారీ చేయడంతో పార్టీ టికెట్ ఎవరికి ఇస్తుందన్న దానిపై చర్చ మొదలై.. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నాగేశ్వర్‌రెడ్డికి ఇస్తారా లేకుంటే కొత్తవారిని ఎంపిక చేసి బరిలో నిలుపుతారా అన్నది పార్టీలో చర్చ నడుస్తోంది.

భవానీకి టికెట్ ?

2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన భవానీరెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరడంతో ఆమెకు దుబ్బాక నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. టికెట్‌ కేటాయింపుపై కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపిన తర్వాతే పార్టీలోకి వచ్చినట్లు గుసగుసలు సైతం వినపడుతున్నాయి. కానీ ఇన్నిరోజులు పార్టీని నమ్ముకొని ఉన్నవారిని కాదని కొత్తగా చేరిన వారికి అవకాశం ఇస్తారా లేదా అన్నది చూడాల్సిన అంశం. మరోవైపు గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నాగేశ్వర్‌రెడ్డికే పార్టీ మరోసారి ఛాన్స్‌ ఇస్తుందని, దీనిపై ఆయన అనుచరులు, కార్యకర్తలు ఇప్పటికే ఉత్తమ్‌కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ ఇద్దరిలో ఒక్కర్ని ఎంపిక చేస్తుందా లేకుంటే మరోనేతకు టికెట్ ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

బీజేపీ నుంచి మళ్లీ రఘునందన్‌రావు ?

బండి సంజయ్‌ తెలంగాణ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత జరగబోతున్న ఉపఎన్నిక కావడంతో గెలుపుపై బీజేపీ తీవ్ర కసరత్తులు ప్రారంభించింది. పార్లమెంట్ ఎన్నికల్లో 4సీట్లు గెలిచి టీఆర్ఎస్‌కు మేమే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న తరుణంలో దుబ్బాక బై పోల్‌ కాషాయం పార్టీకి సవాల్‌గా మారింది. దీంతో అభ్యర్థి ఎంపికను లెక్కలోకి తీసుకున్న రాష్ట్ర బీజేపీ.. మరోసారి రఘునందన్‌రావుకే అవకాశం కల్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ సర్కార్‌పై తనదైన శైలిలో బీజేపీ బాణిని వినిపిస్తుండటంతో పాటు, రెండుసార్లు అక్కడి నుంచే పోటీ చేశారు. నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉండటంతో పాటు, గతంలో ఓడిపోయారన్న సెంటిమెంట్‌ రఘునందన్‌రావుకు కలిసి వస్తుందని ఈ నేపథ్యంలో ఆయనకు టికెట్‌ కేటాయిస్తేనే టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చినట్లు అవుతుందని పార్టీవర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

సోలిపేట ఫ్యామిలీకే టికెట్ ?

2004, 2008, 2014, 2018లో విజయం సాధించిన సోలిపేట రామలింగారెడ్డికి నియోజకవర్గంలో మంచి పేరుంది. గ్రౌండ్ లేవల్‌లో కార్యకర్తలు ఉన్నారు. దీంతో రామలింగారెడ్డి ఫ్యామిలీలో టికెట్ ఇస్తేనే సెంటిమెంట్ కలిసి వచ్చి కారు టాప్‌ గేరులో దూసుకెళ్లి తమ స్థానాన్ని కాపాడుకున్న వాళ్లము అవుతామని హైకమాండ్ లెక్కలు వేస్తుంది. దీనిలో భాగంగానే ఆయన కుమారుడు సతీశ్‌రెడ్డికే టికెట్ ఇచ్చే అవకాశాలను పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వీరి ఫ్యామిలీని కాదని ఇతరులకు టికెట్ ఇస్తే జనాల్లోకి నెగిటివ్ ఫీలింగ్ వెళ్లి.. కాంగ్రెస్, బీజేపీలకు ఛాన్స్‌ ఇచ్చినట్లు అవుతుందని అక్కడి నేతలు కేటీఆర్‌కు విన్నవించినట్లు సమాచారం. అయితే పార్టీ అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించి.. ప్రచారానికి పంపుతుందా లేకుంటే నోటిఫికేషన్ వచ్చాక కేసీఆరే డైరెక్ట్ పేరును ప్రకటించి రంగంలోకి దూకుతారా అన్నది కీలకంగా మారింది. రామలింగారెడ్డి చనిపోయిన రోజు యూనానిమసే అవుతుందని లెక్కలు వేసుకున్న నేతలకు.. ఇప్పుడు దుబ్బాకలో త్రిముఖ పోటీ కనిపిస్తుండటంతో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

Next Story

Most Viewed