‘మనీ’ కున్న విలువ మనిషికి లేదాయే!

by  |
‘మనీ’ కున్న విలువ మనిషికి లేదాయే!
X

దిశ, వెబ్‌డెస్క్ : కష్టాల్లో ఉన్న వ్యక్తికి ఆసరాగా, ఆపదలో ఉన్న వారి ప్రాణప్రధాతగా నిలిచే డబ్బులు ప్రస్తుతం ప్రాణాలు తీస్తున్నాయి. మనీ కోసం కొందరు ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేందుకు వెనకాడటం లేదు. పైసల మత్తులో పడి బంధాలు, బంధుత్వాలు కూడా చూడటం లేదు. కన్న తల్లి నుంచి చెల్లె వరకు, కట్టుకున్న భార్య నుంచి కన్న కొడుకును సైతం డబ్బుల విషయంలో తేడాలస్తే వారిని అడ్డుతొలగించుకునేందుకు కొందరు ఏమాత్రం సంకోచించడం లేదు. కాసులపై వారికున్న పిచ్చే అందుకు కారణంగా తెలుస్తోంది.

ఒకప్పుడు రూ.లక్షలు, వేల కోసం జరిగిన నేరాలు ప్రస్తుతం రూపాయల కోసం జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంతదారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వడం లేదని.. అప్పు ఇచ్చిన వారు పదేపదే అడుగుతున్నారని.. డబ్బుల విషయంలో తనను మోసం చేశారని.. వారసత్వంగా సంక్రమించే ఆస్తులు, డబ్బుల్లో తేడాలొచ్చాయని సొంత అన్నదమ్ములు, అక్కాచెల్లెల్లు సైతం కొట్టుకుంటున్న ఘటనలు తరుచుగా చూస్తునే ఉన్నాం. మరికొన్ని ఘటనల్లో అయితే ఒకరినొకరు రక్తం కళ్ల చూసుకోవడం ఈరోజుల్లో పరిపాటిగా మారింది.

సరిగ్గా ఇలాంటి ఘటనే మహరాష్ట్రలో ఆలస్యంగా వెలుగుచూసింది. వీరేంద్ర యాదవ్(26) అనే వ్యక్తి థానేలో రోడ్ సైడ్ ఇడ్లి బండి నడిపిస్తున్నాడు.ఆ సమయంలో అటుగా వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు నువ్వు మాకు రూ.20 రుణపడి ఉన్నావని అన్నారు. అందుకు ఇడ్లి వ్యాపారి నిరాకరించడంతో అతనితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే ఆ ముగ్గురు వీరేంద్రపై దాడి చేశారు. అనంతరం అతన్ని తోసివేయడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చేరిన బాధితుడు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించాడు. విషయం తెలుసుకున్న థానే పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అయితే, రూ.20 ఓ వ్యక్తి నిండు ప్రాణాలు తీసినట్లు విచారణలో తేలడంతో అందరూ షాక్‌కు గురయ్యారు.



Next Story

Most Viewed