స్వర్ణముఖి నదిలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు.. ఆ పడవే కారణమా..?

by  |
Three students
X

దిశ, ఏపీ బ్యూరో : చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం జి.పాళ్యంలో విషాదం చోటు చేసుకుంది. స్వర్ణముఖి నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఆదివారం సెలవు కావడంతో ఉదయం జి.పాళ్యంకు చెందిన నలుగురు విద్యార్థులు నదికి వెళ్లారు. కొండి కర్రలతో పడవ తయారు చేసి దానిపై నదిలోకి వెళ్లారు. అయితే ఒక్కసారిగా పడవ మునిగి పోవడంతో నలుగురు గల్లంతయ్యారు. వారిలో లిఖిత్ సాయి క్షేమంగా బయటపడగా.. మిగిలిన ముగ్గురూ మునిగిపోయారు. దీంతో లిఖిత్ సాయి ఇంటికి, పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. సమాచారం అందుకున్న రేణిగుంట పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని గల్లంతైన విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. ఉదయం నుంచి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి.

Swarnamukhi river

గల్లంతైన వారు జి.పాళ్యం ఎస్సీ కాలనీకి చెందిన గణేష్(15), యుగంధర్(14), ధోని(16)గా పోలీసులు తెలిపారు. బాలురు మునిగిపోయిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటనాస్థలికి చేరుకుని బోరున విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆదివారం సెలవు కావడంతో నలుగురు చిన్నారులు నదిలో చేపలు పట్టేందుకు వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నదిలో చేపలు పట్టేందుకు కొండి కర్రలతో ఓ పడవ తయారు చేసుకుని ఆ పడవపై నలుగురు నదిలో కొంత దూరం ప్రయాణించారు. అయితే ఆకస్మాత్తుగా పడవ నీటిలో మునిగిపోయింది. ముగ్గురు నదిలో గల్లంతయ్యారు. ముగ్గురిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. గల్లంతైన వారికోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

three students missing

ప్రమాదం విషయం తెలిసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలను పర్యవేక్షించారు. గజ ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ముగ్గురు విద్యార్థులు గల్లంతవ్వడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story

Most Viewed