ఓల్డ్ సిటీలో పోలీసుల అదుపులో యువకుడు.. ఒమన్ నుంచి ఇన్‌స్పెక్టర్‌కు బెదిరింపు కాల్

by  |
ఓల్డ్ సిటీలో పోలీసుల అదుపులో యువకుడు.. ఒమన్ నుంచి ఇన్‌స్పెక్టర్‌కు బెదిరింపు కాల్
X

దిశ, చార్మినార్ : ఒక వర్గానికి చెందిన పిల్లల మీద అనవసరంగా కేసులు పెడుతున్నారు.. ఇంకోసారి నాకు ఫిర్యాదు వస్తే నీ యూనిఫామ్ లేకుండా చేస్తా.. అంటూ పదే పదే మొఘల్‌పురా ఇన్‌స్పెక్టర్ రవికుమార్‌‌కు ఒమన్ దేశం నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. వాట్సాప్‌లో బెదిరింపు కాల్స్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఓ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారికి ఫోన్ చేసి బెదిరించడం పట్ల సౌత్ జోన్ పోలీసులు విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. జరిగిన విషయాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ ఆలీకి ఫిర్యాదు చేయడానికి సన్నద్ధమవుతున్నారు.

వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన పప్పుకుమార్ (24) పదేళ్ల క్రితం పొట్టకూటి కోసం హైదరాబాద్ పాతబస్తీకి వలస వచ్చాడు. మీర్‌చౌక్ ప్రాంతంలో ఉంటూ భవానీ నగర్‌లోని నూడుల్స్ షాపులో పనిచేసేవాడు. ఈ నేపథ్యంలో భవానీనగర్‌లో మరో వర్గానికి చెందిన యువతి నూడుల్స్ తినడానికి అతడి దగ్గరకు వచ్చేది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య స్నేహం కుదిరింది. దీంతో మే 31వ తేదీన వాళ్లిద్దరూ బీబీబజార్ విక్టోరియా హోటల్ నుంచి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరూ వేరు వేరు వర్గాలకు చెందిన వాళ్లు నడుచుకుంటూ వెళ్లాడాన్ని గమనించిన మహ్మద్ షరీఫ్, మహ్మద్ గౌస్ వారిని అడ్డగించారు.

మా వర్గానికి చెందిన యువతిని ఎక్కడికి తీసుకెళ్తున్నావ్ అని అతడిపై దాడిచేశారు. ఈ దాడిలో పప్పుకుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయంపై బాధితుడు వెంటనే మొఘల్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న మొఘల్‌పురా పోలీసులు పప్పు‌కుమార్‌పై దాడికి పాల్పడ్డ మహ్మద్ షరీఫ్, మహ్మద్ గౌస్‌లను అదుపులోకి తీసుకున్నారు. సమాచారం తెలుసుకుని రంగంలోకి దిగిన మొఘల్‌పురా కార్పొరేటర్ సుల్తానా.. వాళ్ళపై కేసులు పెట్టొద్దని ఇన్‌స్పెక్టర్ రవికుమార్‌కు ఫోన్‌లు చేయడం మొదలు పెట్టింది.

కేసు తీవ్రతను పరిశీలించిన పోలీసులు పప్పుకుమార్‌పై దాడికి పాల్పడ్డ ఇద్దరిని మొఘల్‌పురా పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు. దీంతో ఆగ్రహించిన కార్పొరేటర్ కావాలనే మరో వర్గంపై కక్ష కట్టి అనవసరంగా కేసులు పెడుతున్నారని విమర్శలు గుప్పించారు.

ఒమన్ దేశం నుంచి బెదిరింపు కాల్..

మొఘల్‌పురా ఇన్‌స్పెక్టర్ రవి కుమార్ మాట్లాడుతున్నారా.? అవును మీరెవరు అని రవికుమార్ అడిగే లోపే.. నేను ఎవరైతే నీకెందుకు ఓ వర్గం పిల్లల మీద చాలా జులుమ్ చేస్తున్నావ్.. అనవసరంగా కేసులు పెడుతున్నావ్.. నువ్వు ఇన్‌స్పెక్టర్ వా లేక ఆర్ఎస్ఎస్ వాదివా.? నీ మీద చాలా ఫిర్యాదులు అందాయ్.? నీకు ఇదే ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి ఫిర్యాదు వస్తే నీ యునిఫామ్ ఉండదు అని.. రవికుమార్‌కు ఒమన్ దేశం నుంచి మహ్మద్ ఆసిఫ్ అనే వ్యక్తి కాల్ చేసి బెదిరించాడు. ఇన్‌స్పెక్టర్‌ను ఫోన్‌లో బెదిరించిన విషయమై మొఘల్‌పురా పోలీసులు.. మహ్మద్ ఆసిఫ్ మీద విచారణ చేపట్టారు. ఆసిఫ్ పాతబస్తీ రెయిన్ బజార్‌కు చెందినవాడని.. ఐదు నెలల క్రితమే ఒమన్ దేశానికి వెళ్ళాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed