రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ సందేశం ఇదే..

by  |
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ సందేశం ఇదే..
X

దిశ, తెలంగాణ బ్యూరో : సమైక్య రాష్ట్రంలో విస్మరించబడిన రంగాలను ఒక్కటొక్కటిగా ఓపిగ్గా, స్పష్టమైన దార్శనికతతో, ఎన్ని అవాంతరాలు ఎదురైనా లెక్క చేయకుండా చక్కదిద్దుకుంటూ వస్తున్నామని, అమరుల త్యాగాలకు అభివృద్ధి ద్వారానే ఘనమైన నివాళి అర్పించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రైతును కాపాడి, వ్యవసాయాన్ని పునరుజ్జీవింప చేయడమే కాకుండా ఏడేండ్ల కాలంలోనే తెలంగాణను భారతదేశానికే అన్నపూర్ణగా నిలిపామని, దీని వెనక ప్రభుత్వ అకుంఠిత దీక్ష ఉందని అన్నారు. రాష్ట్రం ఆవిర్భవించి ఏడేళ్ళు పూర్తి చేసుకుని ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రకటనలో ప్రజలకు సందేశం ఇచ్చారు.

అనేక పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతో పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్దతిలో పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో దేశమే గర్వించదగ్గ రీతిలో నిలబెట్టుకున్నామని సంతృప్తి వ్యక్తం చేశారు. ధృఢమైన పునాదులతో సుస్థిరతను చేకూర్చుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. నాటి ఉద్యమ నినాదాలను తెలంగాణ ప్రభుత్వం ఒక్కటొక్కటిగా అమలు చేస్తున్నదన్నారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం, రోడ్లు, తదితర మౌలిక వసతులను, స్వల్పకాలిక, ధీర్ఘకాలిక లక్ష్యాలతో కల్పన చేసుకుంటున్నట్లు తెలిపారు. దేశంలోనే అతి పిన్న రాష్ట్రమైనప్పటికీ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో సహచర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని, స్వరాష్ట్రం ఆ స్థాయికి చేరుకున్నందుకు గర్వంగా ఉందని సీఎం తెలిపారు.

రాష్ట్ర జనాభాలో తొంభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినవారేనని, వారి అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని గుర్తుచేశారు. ప్రజల ఆకాంక్షలను కార్యాచరణలో పెట్టాలనే చిత్తశుద్ధి, ధృఢసంకల్పం, నిబద్ధత ఉన్న ప్రభుత్వమని పేర్కొన్నారు.

వృద్ధులు, వికలాంగులు, మహిళలు, కళాకారులు, కులవృత్తులు, ఇతర వృత్తులతో పాటు, ఆసరా అందాల్సిన ప్రతీ వర్గానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడిందని నొక్కిచెప్పారు. ఆర్థికంగా, సామాజికంగా సబ్బండ వర్గాల ఆత్మగౌరవాన్ని ఎత్తిపడుతూ తెలంగాణను సాధించుకున్న ఫలితాలను వారికే అందిస్తూ, వారి ఆనందంలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామిగా మారిందన్నారు.

కరోనా కారణంగా రాష్ట్ర ఖజానాకు కొంత ఇబ్బంది కలిగినా ప్రజల సహకారంతో నిలదొక్కుకుంటున్నామని, ప్రజలు పెట్టుకున్న విశ్వాసం, అభిమానమే కొండంత ధైర్యంగా ఉందన్నారు. ప్రజలిచ్చిన భరోసాతో తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునే వరకు విశ్రమించేది లేదని సీఎం కేసీఆర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


Next Story