రేవంత్ రెడ్డి నయా యాక్షన్ ప్లాన్ ఇదే..

by  |
రేవంత్ రెడ్డి నయా యాక్షన్ ప్లాన్ ఇదే..
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ పార్టీ సంస్థాగత మార్పులపై కొత్త టీపిసిసి చీఫ్​ రేవంత్​రెడ్డి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేసే విధంగా పకడ్బందీ ప్లాన్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా టీపీసీసీకి ఫుల్ పవర్స్ ఇవ్వడంతో ముందుగా డీసీసీ, పీసీసీ టీంపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో యంగ్​టీంను తయారు చేసుకునేందుకు రేవంత్​రెడ్డి సన్నాహాలు చేస్తున్నట్లు పార్టీ నేతల్లో టాక్. అయితే ముందుగా జిల్లాల పర్యటనకు రేవంత్​ ప్రియార్టీ ఇస్తున్నట్లు చెప్పుతున్నారు.

ఏదో కార్యక్రమంతో జిల్లాలకు..!

రాష్ట్రంలో టీఆర్ఎస్ విధానాలపై కాంగ్రెస్​పార్టీ నిరసనలకు దిగుతున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా నిరుద్యోగ అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకున్నా… తాజాగా కేసీఆర్​ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేశారు. దీంతో 48 గంటల దీక్ష చేపట్టే అంశంపై కొంత సందిగ్థత నెలకొంది. దీన్ని పార్టీపరంగా ఎలా అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 12న రేవంత్​ నిర్మల్‌కు వెళ్తున్న విషయం తెలిసిందే.

అయితే ఇలాంటి కార్యక్రమాలతో పలు సందర్భాల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు పర్యటించాలని రేవంత్​రెడ్డి భావిస్తున్నట్లు చెప్పుతున్నారు. నిరసనలు, బహిరంగ సభలు, కార్యకర్తలతో సమావేశాలు… ఇలా ఏదైనా కార్యక్రమాన్ని ముందుంచుకుని జిల్లాల పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయి. జిల్లాల పర్యటనలో డీసీసీ అధ్యక్షుల పనితీరు, నేతలతో విభేదాలు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

నెమ్మదిగా మార్పు

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో గాంధీభవన్‌లో కూర్చుని డీసీసీలు, రాష్ట్ర పార్టీలోని కీలకమైన స్థానాలను ఎంపిక చేసే విధానానికి చెక్​ పెట్టాలని భావిస్తున్నారు. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో కాంగ్రెస్​నేతలు, డీసీసీ, రాష్ట్ర పార్టీ నేతలపై ఎలాంటి అభిప్రాయాలున్నాయి, బలాబలాలు, బలహీనతలేంటనే విషయాలపై ఆరా తీయనున్నారు. పాత కమిటీలను కంటిన్యూ చేయాలా… కొత్త కమిటీలను నియమించాలా అనే అంశాలపై స్థానికంగా కూడా చర్చించాలనుకుంటున్నారు. కొత్త కమిటీలను నియమిస్తే పార్టీకి ఎంత మైలేజ్ వస్తుందనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ప్రస్తుత జిల్లా అధ్యక్షులతో పార్టీకి మైనస్ అనుకుంటే కొత్త టీంను ప్రకటించే అవకాశాలున్నాయి.

అంతా యంగ్​టీం

జిల్లా, రాష్ట్ర కార్యవర్గాన్ని ఎంపిక చేయడంలో యంగ్​టీంతో పాటుగా దూకుడు స్వభావంతో ఉండే నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి భావిస్తున్నారని పార్టీ నేతల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే రెండు, మూడు జిల్లాల నేతలతో మాట్లాడినట్లు కూడా చెప్పుకుంటున్నారు. పాత తరం నాయకులను పక్కన పెట్టి యువ రక్తానికే చోటు కల్పించాలనే ధోరణిలోనే ఉన్నట్టు స్పష్టమవుతోంది. అయితే కమిటీ మార్పులో మాత్రం అన్ని వర్గాలను సంప్రదించి, అందరినీ బుజ్జగించి నిర్ణయం తీసుకుంటారంటున్నారు.

డీసీసీలతో పాటుగా పీసీసీ కూర్పు విషయంలోనూ రేవంత్ అదే బాటలో నడవనున్నారు. యంగ్ అండ డైనమిక్ లీడర్స్ తోనే కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావాలనే యోచనలో ఉన్నారు. రేవంత్ టీపీసీసీ చీఫ్ కావడంతో పార్టీలో కొత్త ఎనర్జీ వచ్చింది. మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్​గా గుర్తింపు ఉండటంతో… దాన్ని అనుకూలంగా మల్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.



Next Story

Most Viewed