మానవత్వాన్ని మంటగలిపిన ఘటన ఇది.. ఇంత ఘోరమా..?

by  |
viral news
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. జిల్లాలోని శివగిరికాలనీ మూడో వీధిలో ఇటీవలే ఓ రిటైర్డ్ ఉద్యోగికి కరోనా వచ్చింది. ఆదివారం అతడు మృతి చెందాడు. అయితే అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత అతడి భార్యను ఇంటి యజమాని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ఆ వృద్ధురాలు అయ్యా ఇంటిలోకి రానివ్వండి అంటూ ఇంటి యజమానిని బ్రతిమిలాడుతున్న తీరు అందర్నీ కలచివేసింది. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు శివగిరి కాలనీ మూడో వీధిలో రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి సాయినాథ్.. తన భార్యతో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడ్డాడు. కరోనా నెగిటివ్ కూడా వచ్చింది. అయితే ఆరోగ్యం క్షీణించడంతో ఆయన జీజీహెచ్‌లో మృతి చెందాడు.

దీంతో ఆదివారం ఉదయం అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అంత్యక్రియలు పూర్తైన తర్వాత సాయినాథ్ భార్య భారతమ్మ శివగిరి కాలనీలోని అద్దె ఇంటికి చేరుకుంది. అయితే ఆ ఇంటి యజమాని మాత్రం ఆమెను ఇంటిలోకి అనుమతించలేదు. దీంతో ఆమె ఇంటి ఎదురుగా రోడ్డు పైన కూర్చొని రోదిస్తోంది. ఓవైపు భర్త చనిపోవడం మరోవైపు ఇంటిలోకి రానివ్వకపోవడంతో ఆ బాధిత మహిళ కన్నీరు మున్నీరుగా రోదిస్తోంది. భర్తపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న మహిళకు అండగా ఉండాల్సింది పోయి ఇలా అమానుషంగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా ఉన్నతాధికారులు కరోనాపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని చెప్తున్నా వాస్తవంగా పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. నెల్లూరు నగరంలో కరోనా వస్తే అద్దె కు ఉంటున్న వారు దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అందుకు భారతమ్మ పరిస్థితే నిదర్శనం. భారతమ్మ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు తక్షణం స్పందించాలని కోరుతున్నారు.



Next Story

Most Viewed