రాష్ట్రాల సరిహద్దులో ఎలాంటి టెస్ట్‌లు ఉండరాదు: కేంద్రం

by  |
రాష్ట్రాల సరిహద్దులో ఎలాంటి టెస్ట్‌లు ఉండరాదు: కేంద్రం
X

దిశ తెలంగాణ బ్యూరో: అంతరాష్ట్ర ప్రయాణాలకు ఎలాంటి ఆంక్షలు లేవని కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా గతేడాది మే 24వ తేదిన విడుదల చేసిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ బుధవారం సవరించింది. ఇతర రాష్ట్రాల నుంచి బస్సు, విమానం, రైలు, తదితర మార్గాల ద్వారా వచ్చే వారు బోర్డర్లలో ఎలాంటి పరీక్షలు లేకుండానే ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది.

అయితే ఆయా రాష్ట్రాల స్థానిక పరిస్థితుల ఆధారంగా బోర్డర్లలో ఆర్‌టీపీసీర్, ర్యాపిడ్ టెస్టులను తప్పనిసరి చేయొచ్చని వివరించింది. ఒక వేళ ఆ నిబంధనలు పెడితే తప్పనిసరిగా ప్రజలకు విసృతంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాలదేనని కేంద్రం నొక్కి చెప్పింది. అదే విధంగా వ్యాక్సిన్ పొందిన వారు ఎలాంటి టెస్టులు లేకుండానే ప్రయాణించవచ్చని పేర్కొన్నది. ప్రయాణ గమ్యస్థానం చేరిన తర్వాత లక్షణాలు తేలితే టెర్మినల్స్ లో యాంటీజెన్ టెస్టులు నిర్వహించుకోవాలన్నది. క్రమంగా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో ఆయా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్గదర్శకాలను మార్చుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది.

1075కు సమాచారం ఇవ్వాలి.

బస్సు, విమానం, రైలు మార్గాల ద్వారా ప్రయాణించే క్రమంలో ఎవరికైనా లక్షణాలు తేలితే వెంటనే సెంట్రల్ కంట్రోల్ రూం నంబరు 1075కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలన్నది. కనీసం కండాక్టర్ , టీటీ, ప్లైట్ సిబ్బందికి తప్పనిసరిగా తెలియజేయాలన్నది. సింప్టమ్స్ ఉన్నోళ్లకు ఎట్టి పరిస్థితుల్లో ఆయా టెర్మినల్స్ లో ఎంట్రీ లేదని కేంద్రం తేల్చి చెప్పింది. అయితే గమ్యస్థానానికి చేరిన తర్వాత బాధ్యతాయుతంగా 15 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ ఉంటే మేలని వివరించింది.

ప్రయాణంలో, ఆ తర్వాత మాస్కు, భౌతికదూరం, శానిటేషన్ వంటి కరోనా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. వినియోగించిన మాస్కులను ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో పడేయరాదని వెల్లడించింది. మరోవైపు ప్రయాణాలు చేసే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యసేతు యాప్ ను తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలన్నది.

క్వారంటైన్ లో పాటించాల్సినవి….

ప్రయాణాలు తర్వాత దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు తేలితే సదరు వ్యక్తులు వెంటనే ఐసోలేషన్ కు వెళ్లాలి.అంతేగాక ఆక్సిజన్ సదుపాయంతో అనుభవం ఉన్న టెక్నిషియన్ ను అందుబాటులో ఉంచుకోవాలి.ఎప్పటికప్పుడు ఆక్సిజన్, శ్వాసరేట్ ను పరిశీలించాలి. పేషెంట్ అటెండర్లు తప్పనిసరిగా పీపీఈ కిట్లు ధరించి సేవలు అందించాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కేంద్రం పేర్కొన్నది.



Next Story