కాంగ్రెస్‌లో టీజేఎస్ విలీనంపై కోదండరాం క్లారిటీ

by  |
TJS Kodandaram
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ జనసమితి పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో విలీనమయ్యే పరిస్థితే లేదని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, కేవలం అబద్ధపు ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు. ఇప్పటివరకు తమ పార్టీలో అలాంటి ఆలోచనే లేదని, కార్యకర్తల నుంచి అలాంటి అభిప్రాయాలు కూడా రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీతో చర్చలు కూడా జరగలేదన్నారు. ఎలాంటి ఆధారం లేకుండానే సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయన్నారు. తెలంగాణ జన సమితి ఒక రాజకీయ పార్టీగా పనిచేస్తుందని, దాని అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటుందని, మరో పార్టీలో విలీనం అయ్యే ప్రశ్నే ఉత్పన్నం కాదని తేల్చి చెప్పారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియా ప్రతినిధులతో పై వ్యాఖ్యలు చేశారు.

కానీ ప్రజా సమస్యలపై మాత్రం అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. పెట్రోలు-డీజిల్-వంటగ్యాస్ ధరల పెంపు, పోడు భూములు, నిరుద్యోగం, ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు తదితరాలకు వ్యతిరేకంగా ఏ పార్టీ పిలుపు ఇచ్చినా వాటితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజా సమస్యలపై సమిష్టి పోరాటానికి రేవంత్ రెడ్డి సహా పలు పార్టీల నేతలు తమ పార్టీ సహకారాన్ని కోరారని గుర్తుచేశారు. తెలంగాణకు కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా కూడా కొట్లాట ఉంటుందన్నారు. ఏపీ సీఎం జగన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తెలంగాణకు కృష్ణా జలాల్లో అన్యాయం జరుగుతున్నదన్నారు.

తెలంగాణ వేదికగా కొత్త రాజకీయ పార్టీ పెడుతున్న షర్మిల ఏపీ నీటి దోపిడీపైనా, అక్రమాలపైనా, తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపైనా ప్రశ్నించగలరా అని వ్యాఖ్యానించారు. నీటిని తరలించుకుపోతున్న జగన్ దూకుడును ఆపగలరా అని ప్రశ్నించారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, త్వరలోనే పార్టీ దీని గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed