ఎన్నికల్లో చిక్కుతున్న డబ్బెవరిది?

by  |
ఎన్నికల్లో చిక్కుతున్న డబ్బెవరిది?
X

ఎన్నికలొచ్చిన ప్రతిసారీ పోలీసులకు పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు దొరుకుతూ ఉంటాయి. పోలీసులు ఆ డబ్బును స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తుంటారు. ఆ డబ్బు ఎవరిది? ఎం దుకు తెచ్చారు? ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడికి తీసుకెళ్లున్నారు? డబ్బు దొరికినవారి మీద చట్టపరంగా తీసుకున్న చర్యలేంటి? కేసుల విచారణ ఏ మేరకు వచ్చింది? కోర్టుల ద్వారా పడిన శిక్షలేంటి? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకడం లేదు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికలు 2018 డిసెంబరులో జరిగాయి. అప్పుడు సుమారు రూ.137 కోట్లను పోలీసులు పట్టుకున్నారు. ఇందులో కొంత మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు. ఇంకొంత జిల్లాల్లోని స్ట్రాంగ్ రూముల్లో ఉంది. ఆ డబ్బు ఎవరిదో మాత్రం ఇప్పటికీ తేలలేదు. పోలీసులు పట్టుకుంటున్న డబ్బంతా రాజకీయ నేతలదే అనేది బహిరంగ రహస్యం. డబ్బు ఒక చోటి నుంచి మరో చోటికి రవాణా అవుతుండగా పట్టుకున్నపుడు అందులోని వ్యక్తి లేదా డ్రైవర్ వివరాలను తీసుకుని పోలీసులు కేసు పెడతారు. డబ్బును స్వాధీనం చేసుకుంటా రు. డబ్బు ఎవరిదో మూలాలను వెతికి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకున్న సంఘటనలు అరుదే. ఇటీవల దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలోనూ రూ. 40 లక్షలు చిక్కాయి.

మూడున్నర వేల కేసులు..

2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డిసెంబరు ఆరు నాటికి పోలీసులు సుమారు రూ. 125 కోట్ల నగదును, బంగారు, వెండి ఆభరణాలు, మద్యం తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 137 కోట్లు అని అంచనా. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో స్వాధీనమైన డబ్బుతో పోలిస్తే సుమారు రూ. 50 కోట్లు ఎక్కువ. నెల రోజుల వ్యవధిలోనే సుమారు పది లక్షల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీజీపీ అప్పట్లో ప్రకటించారు. నగదు, మద్యం రవాణా, ఆభరణాల పంపిణీ, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు గిఫ్టుల పంపిణీ తదితరాలన్నింటినీ కలిపి పితే సుమారు మూడున్నర వేల కేసులు నమోదయ్యాయి. ఇందులో నగదు రవాణాకు సంబంధించినవే సుమారు 550 కేసులు ఉన్నాయి.

ఆర్టీఐ ద్వారా వివరాలు..

ఇన్ని కేసులు ఉన్నా అందులో పావు వంతు కూడా ఎఫ్ఐఆర్‌లు నమోదు కాలేదు. ఆర్టీఐ ద్వారా వివరాలను సేకరించినప్పుడు ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం, పోలీసు శాఖ గణాంకాల ను అందజేశాయి. ఆ వివరాల ప్రకారం 640 సందర్భాల్లో సుమారు రూ. 84 కోట్ల మేరకు నగదును పట్టుకున్నారు. 159 కేసుల్లో రూ.28.27 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్ఐఆర్ నమో దు చేశారు. మిగిలిన రూ. 56 కోట్లను సంబంధిత వ్యక్తులకే వాపసు చేశారు. ఏ సందర్భంలోనూ అభ్యర్థులపై కేసులు పెట్టడంగానీ, చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నదిగానీ లేదు. అభ్యర్థులు అనధికారికంగా చేస్తున్న ఖర్చులో చిక్కుతున్నది పది శాతం కూడా ఉండదని ఓ అధికారి అంచనా. జనగాం ఠాణా పరిధిలో సుమారు రూ. 5.80 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ పోలీసు స్టేషన్ పరిధిలో రూ. 10 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు. నిజానికి ఈ రెండు కేసులు ఎన్‌ఫో ర్స్‌మెంట్ డైరెక్టరేట్ పరిధిలోకి వస్తాయి. ఆ శాఖకు కేసులను అప్పగించలేదని పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ పోలీసు స్టేషన్ పరిధిలో తెలుగుదేశం పార్టీ కార్యాల యానికి తరలిస్తున్న రూ. 49 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేట్ బ్యాంకులో ఎఫ్డీ చేశారు. మరో సంఘటనలో రూ. 14.96 లక్షలను స్వాధీనం చేసుకుని స్టేట్ బ్యాంకులో జమ చేసినట్లు తెలిసింది.

పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేయాలి..

నిబంధనల ప్రకారం పది లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో దొరికినప్పుడు ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇవ్వాలి. డబ్బును రవాణా చేస్తున్న వ్యక్తులతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఉన్న సంబంధాన్ని పోలీసులు పసిగట్టాలి. కొన్ని సందర్భాల్లో నగదుతో పాటు కరపత్రాలు దొరుకుతాయి. లేదా అభ్యర్థితో ఉన్న లింకును ధ్రువీకరించే ఆధారాలూ దొరుకుతాయి. వాటి ఆధారంగా కేసులు పెట్టవచ్చు. కేసులు పెట్టినా అభ్యర్థుల పేర్లను ఎక్యూజ్డ్ అంటూ చివర్లో పెడుతుంటారు. పోలీసులు నిజాయితీగా దర్యాప్తు చేస్తే నాయకులను పట్టుకోవడం కష్టమేమీ కాదు. – పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి

Next Story

Most Viewed