పరుగో.. పరుగు

by  |
పరుగో.. పరుగు
X

దిశ ప్రతినిధి, మెదక్ : వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన జిల్లాల్లో కూలీల కొరత ఏర్పడుతోంది. కరోనా కారణంగా పట్టణంలోని వలసకూలీలు గ్రామాలకు చేరుకుని తమ భూముల్లో పంటలు సాగుచేసుకుంటుండగా, మరి కొందరు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఇలా వ్యవసాయం చేసే వారి సంఖ్య పెరగడంతో వారి వద్ద పని చేసేందుకు కూలీ కొరత ఏర్పడింది. ఉమ్మడి జిల్లాల్లో ఎక్కువగా వర్షాధార పంటలైన వరి, పత్తి, మొక్కజొన్ననే సాగు చేస్తుంటారు. ఇప్పటికే విత్తనాలు వేయడం పూర్తి చేసిన రైతులు పంటల్లో కలుపు తీసే పనుల్లో నిమగ్నమయ్యారు. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కలుపు తీసే పనులతో పాటు ఎరువులు వేయడం, మందులు పిచికారీ చేయడం లాంటి పనులు అంతటా ఒకేసారి ఊపందుకున్నాయి. దీంతో ఏ గ్రామంలో చూసినా అందరు పంట పొలం బాటనే పడుతున్నారు. ఈ ఏడు జిల్లాల్లో పత్తి పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. కానీ కూలీల కొరత వల్ల సకాలంలో కలుపు తీయకుంటే పంటలకు చీడపీడలు ఆశించి పంట ఎదుగుదల నిలిచిపోతుందనే భయం రైతుల్లో కనిపిస్తోంది. కొందరు మోతుబోరు రైతులు అధిక కూలీ డబ్బులను చెల్లించి పనులు పూర్తి చేయిస్తున్నా చిన్న, సన్నకారు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

పట్టణ కూలీలకు పెరిగిన డిమాండ్

గ్రామాల్లో అంతటా ఒకేసారి ఖరీఫ్ పనులు ఊపందుకోవడంతో కూలీలకు డిమాండ్ ఏర్పడింది. విత్తనాలు వేయడం, కలుపు తీయడం, ఎరువులు వేయడానికి అదను దాటి పోతుండడంతో అధిక కూలీ చెల్లించి సాగు పనులు చేసుకోవాల్సి వస్తోంది. స్థానికంగా కూలీలు దొరకక పోవడంతో పట్టణం, మండల కేంద్రాల నుంచి కూలీలను తీసుకోవాల్సి వస్తోంది. నిత్యం ఉమ్మడి జిల్లాల్లో వందల సంఖ్యలో కూలీలు సమీప గ్రామాలకు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. ఒకప్పుడు పని దొరక్క పట్టణాలకు పరుగులు తీసిన జనాలు ప్రస్తుతం పల్లెల్ల వైపు పరుగులు తీస్తున్నారు. గ్రామాల్లో సాధారణంగా రోజుకు కూలి సుమారుగా రూ.100 నుంచి రూ.150 వరకు చెల్లిస్తారు. కానీ ప్రస్తుతం కూలీల కొరతతో ఒక రోజు కూలీకి రూ.300 నుంచి రూ.500 వరకు చెల్లించాల్సి వస్తోంది. అలాగే అదనంగా కూలీలకు రానుపోను రవాణా చారీలను రైతులే చెల్లిస్తున్నారు.



Next Story

Most Viewed