సీఎం సొంత జిల్లాల్లోనూ ఖాళీలే.. వెక్కిరిస్తోన్న కుర్చీలు

by  |
సీఎం సొంత జిల్లాల్లోనూ ఖాళీలే.. వెక్కిరిస్తోన్న కుర్చీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘కన్నతల్లికి అన్నం పెట్టనోడు… పిన తల్లికి బంగారు గాజులు చేయిస్తడట’ అనే సామెతను ఉద్యమం సమయంతో పాటు స్వరాష్ర్టం ఏర్పడిన తర్వాత కూడా సీఎం కేసీఆర్​అనేక సందర్భాల్లో విరివిగా ప్రస్తావించారు. కానీ నర్సులు కొరత అంశంలో ఇప్పుడా సెటైర్​సీఎం కేసీఆర్‌కు వర్తించేలా పలువురు ప్రజలు రివర్స్‌లో కొడుతున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా సుమారు 10 వేల కోట్లను ఖర్చు చేసి వైద్యరంగాన్ని మరింత బలోపేతం చేస్తానని హామీ ఇచ్చిన సీఎం, సొంత జిల్లా పరిస్థితిపై దృష్టి పెట్టడం లేదని మండిపడుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నా సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్​రావులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మౌలిక వసతులను ఏర్పాటు చేసినా, సిబ్బంది లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పేషెంట్లను 24 గంటల పాటు నిత్యం పర్యవేక్షించే నర్సులు లేక సిద్ధిపేట జిల్లాలోని పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో వైద్యసేవలు ఆలస్యంగా అందుతున్నాయి. కేవలం బిల్డింగ్‌లు సమకూర్చిన సర్కార్, స్టాఫ్‌ను రిక్రూట్​చేయడాన్ని మరిచింది. కొన్ని చోట్ల తాత్కాలిక సిబ్బందిని నియమించినా, వారు సకాలంలో విధులకు హాజరుకావడం లేదని స్వయంగా మెడికల్​ఆఫీసర్లే పేర్కొనడం గమనార్హం. దీంతో రాత్రివేళల్లో చికిత్సకు వచ్చే బాధితులకు తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. డాక్టర్లతో పాటు నర్సులు లేక అత్యవసర పరిస్థితుల్లో వచ్చే పేషెంట్లు అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీంతో హైదరాబాద్​ కు పరుగులు పెట్టాల్సి వస్తుందని సిద్ధిపేట జిల్లాకు చెందిన ఓ వ్యక్తి దిశకు చెప్పారు. సిద్దిపేటతోపాటు భద్రాద్రి కొత్తగూడెం ఆదివాసీ ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి ఉన్నదని అధికారిక లెక్కలను గమనిస్తే అర్థం అవుతున్నది.

సిద్ధిపేట జిల్లాలో ఆధ్వాన్నంగా పరిస్థితి

వైద్యవిధాన పరిషత్​పరిధిలోకి వచ్చే చేర్యాల సీహెచ్‌సీలో 2 హెడ్​నర్సు పోస్టులుండగా, కనీసం ఒక్కరూ లేరు. ఇక పది స్టాఫ్​నర్సులుగాను కేవలం 7 మాత్రమే ఉన్నారు. వీరిలో ఒకరు కాంట్రాక్ట్​ పద్ధతిలో పనిచేస్తున్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. దుబ్బాక సీహెచ్‌సీలో ఇద్దరు స్టాఫ్​నర్సులు శాశ్వత విధానంలో పనిచేస్తుండగా, పది స్టాఫ్​నర్సు పోస్టుల్లో కేవలం ఆరుగురు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్​ఏరియా ఆసుపత్రిలో రెండు నర్సింగ్​సూపరింటెండెంట్​పోస్టుల్లో కేవలం ఒకరు మాత్రమే ఉన్నారు. ఐదుగురు హెడ్ నర్సుల్లో నలుగురు, 28 స్టాఫ్​నర్సుల్లో 21, విభాగం 2లో నలుగురు స్టాఫ్​నర్సులుగాను ముగ్గురు పని చేస్తున్నారు.

ఇక మంత్రి హరీష్​ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట​ఏరియా ఆసుపత్రిలో మరీ దారుణమైన పరిస్థితులున్నాయి. 24 స్టాఫ్​నర్సు పోస్టులుండగా, ఒక్కరు కూడా పర్మినెంట్​ఉద్యోగి లేరు. కేవలం ఏడుగురు కాంట్రాక్ట్​ విధానంలో పనిచేస్తున్నట్టు అధికారులు ఇచ్చిన రిపోర్టులో ఉన్నది. ఎన్‌హెచ్ఎం స్కీంలో అందుబాటులోకి తీసుకువచ్చిన మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్‌లో 8 స్టాఫ్​నర్సు పోస్టులుండగా, అన్నీ ఖాళీగా ఉండటం గమనార్హం. ఇక్కడ కేవలం ఇద్దరిని కాంట్రాక్ట్​ విధానంలో నియమించుకున్నారు. నంగునూరు పీహెచ్‌సీలో 19 స్టాఫ్​నర్సు పోస్టులుండగా, కేవలం ఒకరు మాత్రమే ఉన్నారు. హుస్నాబాద్​సీహెచ్‌సీలో ఇద్దరు హెడ్ నర్సులుండగా, అవీ ఖాళీగానే ఉన్నాయి. 11 స్టాఫ్ నర్సుల్లో కేవలం 3 మాత్రమే ఉన్నారు.

మంత్రి కేటీఆర్ పరిధిలోనూ అంతే..

మంత్రి కేటీఆర్​ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లా నియోజవర్గంలోనూ నర్సులు కొరత తీవ్రంగా వేధిస్తున్నది. సిరిసిల్లా జిల్లా ఆసుపత్రిలో నర్సింగ్​విభాగంలో 47 పోస్టులుండగా, కేవలం 29 మంది మాత్రమే పనిచేయడం గమనార్హం. దీంతో పాటు టీవీవీపీ పరిధిలోకి వచ్చే భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఒక నర్సింగ్​సూపరింటెండెంట్​పోస్టు ఖాళీగా ఉన్నది. 53 స్టాఫ్ నర్సు పోస్టులుండగా, 33 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంతేగాక 7 ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

సీఎం జిల్లాలోనే ఖాళీగా ఉంటే మిగిలిన వాటి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు

సీఎం సొంత జిల్లాలోనే నర్సుల కొరత ఉన్నదంటే, మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. శాశ్వత విధానాల్లో నియామకాలు చేయాలని అనేక మార్లు కోరినా సర్కార్​ పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఉన్న నర్సులపై ఒత్తిడి పెరిగింది. కరోనా సమయంలో ఇది మరింత రెట్టిపైంది. బిల్డింగ్‌లు, బెడ్లు పెంచినా లాభం లేదు. వాటికి అనుగుణంగా నర్సులు, ఇతర స్టాఫ్ లేనిదే మెరుగైన వైద్యం ఎలా అందుతుంది? సిబ్బంది కొరతతో ఆసుపత్రుల్లో నరకయాతన పడుతున్నాం. అత్యవసర పేషెంట్లకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.
-గోవర్ధన్, నర్సింగ్ సమితి అసోసియేషన్ ఫౌండర్


Next Story