ఆ పల్లెలకు ‘వెలుగు’ ఇంకెప్పుడు.. సజ్జనార్ సాయం చేయండి..?

by  |
ఆ పల్లెలకు ‘వెలుగు’ ఇంకెప్పుడు.. సజ్జనార్ సాయం చేయండి..?
X

దిశ, కరకగూడెం: అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. రహదారి సౌకర్యం ఉన్నా ఆర్టీసీ బస్సు గ్రామాలకు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రం నుండి చిరుమల్ల, రామయనపేట గ్రామాలకు బీటీ రోడ్డు ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సు వెళ్లడం లేదు. అలాగే విరాపురం క్రాస్ రోడ్డు నుండి విరాపురం, రేగళ్ల గ్రామాలకు, అనంతారం నుండి కొత్తూరు, చొప్పలా, రేగుళ్ళ తదితర గ్రామాల్లోకి బస్సులు రాకపోవడంతో ఆయా గ్రామాల్లోని విద్యార్థులు, రోగులు, దూర ప్రాంతాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

పల్లె వెలుగు లేక ప్రమాదపు ప్రయాణాలు..

గ్రామాల్లోకి పల్లె వెలుగు బస్సులు రాకపోవడంతో ప్రైవేట్ వాహనాల్లో ప్రమాదపు అంచుల్లో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా కూలీలు ట్రాక్టర్లలో, టాటా ఎస్ ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణిస్తున్నారు. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, సంబంధిత శాఖ అధికారులు స్పందించి పల్లెలకు బస్సులను నడిపించాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed