రద్దీగా ఉండే ఆస్ప్రతులే వారి టార్గెట్..!

by  |
రద్దీగా ఉండే ఆస్ప్రతులే వారి టార్గెట్..!
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: రద్దీగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రులను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు దుండగులు. రోగులతో పాటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బందిని కూడా వదలడం లేదు. రోగుల సహాయకులుగా వార్డుల్లో తిరుగుతూ.. అదును దొరకగానే దొంగతనానికి పాల్పడి అక్కడి నుంచి జారుకుంటున్నారు. కరోనాతో పాటు పలు రకాల జబ్బున పడిన వారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పేద రోగులను టార్గెట్ చేస్తూ వారి కళ్లు కప్పి చేతికి పనిచెప్తూ పరారీ అవుతున్నారు.

కరోనా బారిన పడిన వారి కోసం ప్రభుత్వం నగరంలో కొన్ని ఆస్పత్రులను కోవిడ్ ఆస్పత్రులుగా ఏర్పాటు చేసింది. వీటిల్లో చేరే రోగుల వద్ద సహాయకులుగా ఉండేందుకు అనుమతి లేదు. కేవలం కోవిడ్ రోగులు మాత్రమే వార్డుల్లో చికిత్సలు పొందుతుండగా, అలాంటి వారిని సైతం దొంగలు వదలడం లేదు. మాస్కులు, గ్లౌజులు ధరించి సిబ్బందిలా నటిస్తూ తమ పని చేసుకుపోతున్నారు. సెల్‎ఫోన్లు, బంగారు ఆభరణాలు, పర్సులు, నగదు కనబడితే చిటికెలో మాయం అవుతున్నాయి. దీంతో వైద్యం కోసం ఆస్పత్రులలో చేరిన వారు ఇబ్బందులు పడుతున్నారు.

ఆస్పత్రుల్లో చేరి వైద్యం పొందే వారిలో అధిక శాతం స్థానికేతరులు కావడంతో చాలా వరకు కేసులు పెట్టడం లేదు. చోరీల ఫిర్యాదులు రాకపోవడంతో పోలీసులు కూడా దృష్టి సారించడం లేదు. ఉస్మానియా వంటి ఆస్పత్రుల్లో చివరకు ఫ్యాన్లు, ఏసీ ఔటర్లు, కరెంటు మోటార్లు వంటివి కూడా వదలకుండా దొంగతనానికి పాల్పడిన ఘటనలు చోటు చేసుకోగా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులలో పెరిగిపోతున్న దొంగతనాలను అరికట్టేందుకు పోలీసు భద్రత మరింత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed