నాలుగేండ్ల క్రితం చోరీ.. ఎట్టకేలకు పట్టుబడిన నిందితులు

by  |
SP Ranjan Ratan Kumar
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు నాలుగున్నర సంవత్సరాల క్రితం జరిగిన ఓ కేసును చేధించారు. నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.11 లక్షల విలువైన సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ మంగళవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2017 జనవరి 23న అర్ధరాత్రి శాంతి నగర్‌లోని సురేష్ బంగారు షాపులో గుర్తుతెలియని దొంగలు 415 గ్రాముల బంగారం, పది కిలో గ్రాముల వెండి, రూ. 50 వేల నగదు దొంగిలించినట్లుగా యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. 2020లో రాజోలి వైన్ షాప్‌లో జరిగిన దొంగతనం కేసులో ఇటిక్యాల మండలం పాతర్ల గ్రామానికి చెందిన బోయ రాధాకృష్ణ, ఐజ మండలం జిడిదొడ్డి గ్రామానికి చెందిన బోయ మద్దిలేటిని అదుపులోకి తీసుకొని విచారించగా, దొంగతనం చేసినట్లు అంగీకరించారు.

బంగారం, వెండిని అనంతపురం జిల్లా రవీందర్ రెడ్డి, ఆంజనేయులు, గంగన్న అనే వ్యక్తులకు విక్రయించారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలు అనంతపురం జిల్లాకు వెళ్లి రవీందర్ రెడ్డి, ఆంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా, వారిపై గతంలోనే కేసులు ఉన్నాయని గుర్తించారు. ఈ కేసును చేధించడంలో కీలక పాత్ర పోషించిన శాంతినగర్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రీహరి, సిబ్బంది శేఖర్, ముత్త రాజు, రాజ వర్ధన్ రెడ్డి, రంజిత్ కుమార్, వెంకప్ప, యాకూబ్, విజయ రాజు, ప్రభాకర్, దానియేలు, రామకృష్ణ, రాజశేఖర్, ఆంజనేయులు, రాజు తదితరులను ఎస్పి ప్రత్యేకంగా అభినందించారు.



Next Story