బీసీల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది

by  |
Jayaram
X

దిశ, ఏపీ బ్యూరో: వాల్మీకి రామాయణం రచిస్తే.. సీఎం జగన్ పేదల జీవితాలు బాగు చేసే కార్యక్రమం రచిస్తున్నారని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధానిలో వాల్మీకి విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని వెల్లడించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వాల్మీకి/బోయ కార్పొరేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, నవరత్నాలు అమలు కమిటీ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణ మూర్తిలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ లోకానికి రామ ధర్మాని పరిచయం చేసిన వ్యక్తి వాల్మీకి అని చెప్పుకొచ్చారు. బోయలను గుర్తించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు. బోయల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. జగన్‌ బీసీలను ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. బీసీలను గత ప్రభుత్వం ఓటు బ్యాంకుగా చూసిందని కానీ వైసీపీ 139 కులాలను గుర్తించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని వెల్లడించారు. 139 బీసీ కులాలను గుర్తించడంతోపాటు వారిని చైతన్యవంతులు చేసే దిశగా ప్రభుత్వం ఓ కార్యచరణతో ముందుకు వెళ్లుతుందని మంత్రి వేణు తెలిపారు.

ఈ ప్రభుత్వం బీసీల ప్రభుత్వమని మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వానికి బీసీల నుండి వచ్చే మద్దతు చూసి.. టీడీపీకు ఇప్పుడు బీసీలు గుర్తుకు వస్తున్నారని విమర్శించారు. బీసీలను వంచించి.. వారిని ఓటు బ్యాంకు చూసి.. రాజకీయ లబ్ధిపొందిన ఏకైక పార్టీ టీడీపీయేనని చెప్పుకొచ్చారు. కానీ వైసీపీ ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి కృషి చేస్తోందని ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తిలు స్పష్టం చేశారు.


Next Story

Most Viewed