‘ఇరవై నెలలు కష్ట పడితే టీఆర్ఎస్ పాలన అంతం’

by  |
‘ఇరవై నెలలు కష్ట పడితే టీఆర్ఎస్ పాలన అంతం’
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రంలో ఉప ఎన్నికల వస్తేనే అభివృద్ధి పథకాలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో అభివృద్ధి అంటే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని పరిస్థితి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాదు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మధుయాష్కీ, మహేష్ కుమార్ గౌడ్ లకు సన్మానం సత్కారం కార్యక్రమం జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ లేనిది తెలంగాణ రాష్ట్రం లేదు అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎంపీల వల్లే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందనారు. నిజామాబాద్ జిల్లా నుంచే కేసీఆర్ అంతం ఆరంభం అవుతుంది అని జోష్యం చెప్పారు. సమిష్టి బాధ్యతతో పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాల్సిన అవసరం పార్టీ శ్రేణులు తీసుకోవాలి అన్నారు.

దళితులకు సాధికారాతకు మూడెకరాల భూమిని ప్రభుత్వం పక్కన పెట్టిందని, ఎప్పుడో మూడెకరాల భూమి ఇస్తే దళితులు అభివృద్ధి చెందే వారు కానీ ఇప్పుడు 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపు కుంటున్నారు అన్నారు. దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ ఎందుకు తీసుకున్నారని రాష్ట్రంలో ఏదో ఒక దళిత నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టవచ్చు కదా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్బండ నిధులు 30 వేల కోట్లు ప్రభుత్వం ఏడేళ్లలో ఖర్చు చేయలేదు అన్నారు. రాష్ట్రంలో దళిత ద్రోహి కేసీఆర్ అని, గిరిజనులను కూడా కేసిఆర్ మోసం చేశారన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉండగా వాటిని పక్కన పెట్టారు. గిరిజనులకు నాలుగు శాతం రిజర్వేషన్లు పక్కన పెట్టి, బీసీలకు మూడు వేల కోట్ల లో కనీసం 300 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు అన్నారు . ఎంపీ అరవింద్ ను పసుపు రైతులు క్షమించరు. ముస్లింలను కూడా కెసిఆర్ మోసం చేస్తున్నాడని 6 శాతం రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వడం లేదొ మైనార్టీ లకు సమాధానం చెప్పాలన్నారు.

ఇరవై నెలలు కష్ట పడితే టీఆర్ఎస్ పాలన అంతం….

-రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మధు గౌడ్ యాష్కీ
జిల్లా ప్రజల వల్లే ఈ స్థాయి వచ్చాను జిల్లా ప్రజలకు పార్టీ శ్రేణులకు రుణపడి ఉంటా. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ దే అధికారం. 20 నెలలు కష్టపడితే చాలు. కేసీఆర్ అవినీతి అసమర్థ పాలనను అంతమొందించేందుకు పార్టీ శ్రేణులను సిద్ధం కావాలి. టీఆర్ఎస్ పాలనను అంత మొందించేందుకు అన్ని వర్గాలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. పార్టీ మాపై పెద్ద బాధ్యతను పెట్టింది. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే మా ముందున్న కర్తవ్యం. పార్టీ నాయకులను కార్యకర్తలను రక్షించుకుందాం. తిరిగి నాయకులంతా కలిసి పని చేసి పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తాం. ఏడేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఉంది. మాజీ ఎంపీ కవిత ఇచ్చిన హామీలను విస్మరించారు. పసుపు బోర్డు పై ప్రస్తుత ఎంపీ మాట తప్పాడు. కాంగ్రెస్ హయాంలో శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేశారు. రైల్వే లైన్ పూర్తి చేసింది కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్, బీజేపీ పాలనలో జిల్లాకు వచ్చింది ఏమీ లేదు. జిల్లా పరిస్థితి దారుణంగా ఉంది. టీఆర్ఎస్ నేతల ఆస్తులు పెరుగుతున్నాయి. ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో నిధులన్నీ దోచుకుంటున్నారు. నీళ్లు పోతుంటే మాట్లాడడం లేదు. దళితులను మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఓట్ల కోసం దళితులు గుర్తుకొస్తున్నారు. మైనార్టీలను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. ముస్లింలకు గిరిజనులకు రిజర్వేషన్ల మాట మారిచారు…

రాబందుల కంటే ఘోరంగా రాష్ట్రాన్ని దోచుకుంటోంది కేసీఆర్ ఫ్యామిలీ…

-టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
సోనియాగాంధీ నమ్మకాన్ని నిలబెడతాం. కొత్త కమిటీతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీకి పూర్వవైభవం వస్తుంది. సోనియాగాంధీ లేకుండా తెలంగాణ వచ్చేది కాదు కేసీఆర్ కు అధికారం వచ్చేది కాదు. కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్లే తెలంగాణ వచ్చింది. తెలంగాణ కోరుకున్నది ఇప్పుడు జరగడం లేదు. ఉద్యోగాలు నీటి పంపిణీ లో న్యాయం జరుగుతుందని సామాజిక న్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రజలు కోరుకుంటే అందరికీ మంచి జరుగుతుందని ఇచ్చిన తెలంగాణలో రాబందుల కంటే ఘోరంగా కేసీఆర్ కుటుంబం రాష్ట్ర ఖజానాకు దోచు కుంటుంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతోంది. ఏడున్నర ఏళ్లలో మూడున్నర లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వేలాది కోట్లు కేసీఆర్ కుటుంబం దోచుకుంది. ప్రధాని మోడీ అబద్ధాలకోరు. వారికి న్యాయం జరగడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్యకర్తలు నాయకులు పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని అహర్నిశలు కష్టపడి పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తాము. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షడి పదవి జిల్లా ప్రజలు, జిల్లా పార్టీ నాయకులు ప్రోత్సాహం వల్లే. ప్రజల లో మార్పు కనిపిస్తుంది రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారం. కాంగ్రెస్ పార్టీ వల్లే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయి. ర్యాలీని సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేసిన పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు…

ఈ సన్మాన కార్యక్రమం లో మాజీ ఎంపీలు సిరిసిల్లా రాజయ్య, పొన్నం ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యేలు గంగారం, జనార్దన్ గౌడ్ ,సంపత్, మాజీ విప్ అనిల్, కత్తి వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాలా మోహన్ రేడ్డి, నగర అధ్యక్షులు కేశ వేణు ,అర్బన్ ఇంచార్జి తాహెర్ బిన్ హందన్,రూరల్ ఇచ్చార్జీ భూపతి రెడ్డి,రాష్ట్ర కిసాన్ ఖేత్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, శేఖర్ గౌడ్, ముప్పా గంగారెడ్డి, రమర్తి గోపి, ఏ బీ శ్రీనివాస్, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు ధనలక్ష్మి, దయాకర్ గౌడ్, నగేశ్ రెడ్డి, రాంభూపాల్, ఇర్ఫాన్, సీత రామరాజు, విపుల గౌడ్, వేణు రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed