టెంపుల్ టూరిజం అభివృద్ధి : శ్రీనివాస్ గౌడ్

by  |
srinivas goud
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం టెంపుల్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తోందని అందులో భాగంగానే రూ.1400 కోట్లతో యాదాద్రి ఆలయ నిర్మాణం చేపడుతోందని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ ఎగ్జిబిషన్‌ను మంత్రి ప్రారంభించారు. 15 రాష్ట్రాలకు చెందిన టూరిజం స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు. ఆయా రాష్ట్రాలలోని టూరిజం ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ టూరిజం అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు.

రాష్ట్రంలోని పర్యాటక, చారిత్రక, వారసత్వ సంపద పరిరక్షణకు చర్యలు చేపట్టామన్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన వెయ్యి స్థంబాల గుడి, వరంగల్ కోట, చార్మినార్, గోల్కొండ కోట, మన్యం కొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం, కేసీఆర్ ఏకో అర్బన్ పార్క్, నల్లమల్లలోని సోమశిల, అక్కమహదేవి గుహలు, పర్హాబాద్ వ్యూ పాయింట్, జలపాతాలు, కోటలు, అటవీ , గిరిజన సంస్కృతికి సంప్రదాయాలు, సమ్మక్క సారాలమ్మ జాతర, లక్నవరం, దేశంలోనే మూడవ అతిపెద్ద ముత్యాల దార జలపాతం, కృష్ణ, గోదావరి నదుల మధ్య ఉన్న ప్రకృతి రమణీయ ప్రదేశాలుతో పాటు రాష్ట్రంలో అనేక పర్యాటక ఆకర్షణీయమైన ప్రదేశాలున్నాయన్నారు.

తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని ఇతర దేశాలకు చెందిన ప్రతినిధులను మంత్రి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, వివిధ రాష్ట్రాలైన కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కాశ్మీర్, మాల్దీవిస్ టూరిజం, అండమాన్, 15 రాష్ట్రాల టూరిజం అధికారులు, టూరిజం అధికారులు మహేష్, ఓంప్రకాష్, శశిధర్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed