కాంగ్రెస్‌లో కొత్త చర్చ.. ‘నేను సభ్యుడినే కాదు.. సస్పెండ్ ఏంటి?’

by  |
Rathod Ramesh
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సీనియర్ నాయకుడు రాథోడ్ రమేష్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కొత్త వివాదానికి తెరలేపింది. రాథోడ్ 2018లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా, 2019లో ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆయనను సస్పెండ్ చేస్తున్నామని టీపీసీసీ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ కోదండరెడ్డి ప్రకటించారు. అసలు తాను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే తీసుకోలేదని.. సభ్యత్వం ఇస్తే నబరు చెప్పాలని రమేశ్ సవాల్ విసిరారు. సభ్యత్వం తీసుకోకున్నా సస్పెండ్ చేయటమేంటని ప్రశ్నిస్తున్నారు. రాథోడ్ రమేష్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. ఎంపీగా, జడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన భార్య సుమన్ రాథోడ్ కూడా ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ పార్టీలో చేరి కొద్దికాలమే ఉన్నారు. 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖానాపూర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడారు. 2019 ఎంపీగా ఓడారు. తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. తాజాగా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే వార్తలు వినిపించాయి. ఇటీవల బీజేపీ నేత, ఎంపీ సోయం బాపురావును రాథోడ్ రమేష్ కలవటంతో ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఈ విషయంలో జిల్లా నాయకుల ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ సస్పెండ్ చేశారు.

టీపీసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ తీరుపై రమేశ్ తీవ్రంగా విరుచుకు పడ్డారు. బీజేపీలో చేరే విషయం తర్వాత అని, సభ్యుడిని కాకపోయినా ఎలా సస్పెండ్ చేస్తారని నిలదీశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా ఓడినా.. ఇన్చార్జితో పాటు ఎవరైనా.. ఎప్పుడైనా పిలిపించారా? అని మండిపడ్డారు. ఉత్తమ్ ఇలా.. రాహుల్ అలా.. అని తిట్టామా అని ప్రశ్నంచారు. వాళ్ల పరువు కాపాడుకునేందుకు తనకు టికెట్ ఇచ్చారన్నారు. రైతు భరోసా కార్యక్రమానికి భట్టి విక్రమార్క వచ్చినపుడు జిల్లా నాయకులు రాలేదన్నారు. ‘‘మాకు పార్లమెంట్ ఎన్నికల్లో మూడు లక్షల ఓట్లు వచ్చాయి. ఏ స్టేట్ లీడర్ అయినా వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పారా? అని ప్రశ్నంచారు. కనీసం డైరెక్షన్ ఇచ్చేవారు లేరని ఎద్దేవా చేశారు.


Next Story

Most Viewed