కన్న బిడ్డల దుర్మార్గం.. రెండ్రోజులుగా రోడ్డుపైనే తండ్రి

by  |
కన్న బిడ్డల దుర్మార్గం.. రెండ్రోజులుగా రోడ్డుపైనే తండ్రి
X

దిశ, జగిత్యాల : పున్నామా నరకం నుంచి తండ్రిని రక్షించేవాడే తనయుడు అంటారని అనాధిగా వస్తోన్న మాట. కానీ ప్రస్తుత సమాజంలో తండ్రి బతికుండగానే కన్న బిడ్డలు నరకకూపంలోకి నెట్టేస్తున్నారు. కనిపెంచి పెద్దచేసిన తల్లిదండ్రులకు వృద్దాప్యంలో పట్టెడు అన్నం పెట్టేందుకు అరిగోస పెడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే జగిత్యాల జిల్లాలో కేంద్రంలోని విద్యానగర్‌లో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వృద్ధాప్యంలో ఉన్న తండ్రికి నాలుగు మెతుకులు పెట్టేందుకు కొడుకు, కూతురు వెనుకాడారు. దీంతో ధర్మపురి మండలం నెరేళ్లకు చెందిన పాదం ఇంద్రయ్య అనే వృద్ధుడు గత రెండు రోజులుగా పట్టణంలోని ఓ స్కూల్ సమీపంలో రోడ్డుపై పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు డి డబ్ల్యూ ఓ నరేష్‌కు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన ఆయన వృద్దుని వివరాలు తెలుసుకుని అతని కొడుకు, కూతురులకు సమాచారం ఇచ్చారు. తండ్రితో తమకు ఎలాంటి సంబంధం లేదని వారు సమాధానం ఇవ్వడంతో చివరకు జగిత్యాలలోని వృద్ధాశ్రమానికి తరలించారు.

ఈ సందర్భంగా డి డబ్ల్యూ ఓ మాట్లాడుతూ.. వృద్దుని వివరాలు అడగగా తన కూతురు ఇంటికి వచ్చానని చెప్పాడు. కూతురి అడ్రస్ తెలుసుకొని సమాచార ఇవ్వగా ఆయనకు మాకు ఎలాంటి సంబంధం లేదని ఇంద్రయ్య కూతురు తెలిపింది. ఆ వెంటనే అతని కొడుకు రమేష్‌కు ఫోన్ చేస్తే గత ఆరు నెలలుగా తన తండ్రి నా వద్దే ఉన్నాడని.. ఇప్పుడు నేను తీసుకోపోలేనని, ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపి ఫోన్ కట్ చేశాడు. దీంతో చేసేదేమీ లేక జగిత్యాలలోని గాయత్రి వృద్ధాశ్రమానికి ఇంద్రయ్యను తరలించినట్లు నరేష్ తెలిపారు. కన్న తండ్రికి తిండి పెట్టలేని ఇలాంటి బిడ్డలపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కార్యక్రమంలో డీసీపీవో హరీష్ సిబ్బంది పాల్గొన్నారు.



Next Story

Most Viewed